మా నిధులు దారిమళ్లుతున్నాయ్
దళిత, గిరిజన సంఘాల ఆగ్రహం
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల నిధులు దారి మళ్లుతున్నాయని పలు దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఓయూ క్యాంపస్ గెస్ట్హౌస్లో దళిత, గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్–టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అధ్యక్షత వహించగా.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 60 కులాల నేతలు పాల్గొని ప్రసంగించారు.
మంత్రి జగదీశ్వర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి నిర్లక్ష్యం కారణంగా దళితులు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతకుల భాస్కర్ ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కుంటుపడిందన్నారు. కార్యక్రమంలో లంబాడీ నేత బాబులాల్ నాయక్, ఏపీ, టీఎస్ ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు కె.యాదగిరి, అంబేడ్కర్ సంఘం వ్యవస్థాపకుడు ప్రేమ్కుమార్, పలు సంఘాల నేతలు మేడి పాపయ్య, సురేందర్, శ్యాంరావు, మల్లికార్జున్, మంగేష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.