చిక్కారో.. చుక్కలే..!

చిక్కారో.. చుక్కలే..! - Sakshi


పెండింగ్‌ చలాన్లపై అదనపు బాదుడు!

భారీగా ఉంటే కోర్టుల్లో చార్జిషీట్లు

20 శాతం పెనాల్టీ విధించనున్న న్యాయస్థానం

►  పెండింగ్‌ చలాన్లు 41.3 శాతం


హైదరాబాద్: నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉల్లంఘనులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2014–16 మధ్య జారీ అయిన ఈ–చలాన్లలో 41.3 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ మూడేళ్ల కాలంలో 1.03 కోట్లు చలాన్లు జారీ కాగా, ఇందులో 42.62 లక్షల చలాన్లకు సంబంధించి వాహనచోదకులు జరిమానాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్‌ విభా గం అధికారులు ఉల్లంఘనులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇలాంటి వారిపై న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేస్తుండగా... కోర్టు ఉల్లంఘనులకు పెండింగ్‌లో ఉన్న చలాన్‌ మొత్తానికి అదనంగా 20శాతం పెనాల్టీ విధిస్తోందని ట్రాఫిక్‌ చీఫ్‌ డాక్టర్‌ రవీందర్‌ పేర్కొన్నారు.



ఎక్కువ చలాన్లుంటే చార్జిషీట్లే...

సిటీలోని అనేక వాహనాలపై భారీ సంఖ్యలో ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ట్రాఫిక్‌ అధికారులు గుర్తించారు. పీడీఏ మెషిన్ల ద్వారా గుర్తించి, పట్టుకున్నప్పుడు ఇలాంటి వారిని కేవలం జరిమానాతో సరిపెట్టట్లేదు. వీరి నుం చి వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు పెండింగ్‌లో ఉన్న చలాన్‌ మొత్తానికి 20శాతం అదనంగా పెనాల్టీ విధిస్తున్నాయి. ఈ మొత్తం చెల్లించని పక్షంలో వాహనచోదకుడికి జైలు శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ పేర్కొన్నారు. వాహనచోదకులు ఉల్లంఘనలకు పాల్పడకూడదని, పాల్పడినవారు ఎప్పటికప్పుడు వాటిని క్లియర్‌ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.



అంతా నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌...

ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్‌ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా పోలీసుస్టేషన్‌ నుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. అక్కడి అధికారులు ఈ ఫొటోల ఆధారంగా వాహనచోదకులకు పోస్టు ద్వారా ఈ–చలాన్లు పంపిస్తున్నారు.



భారీగా పెండెన్సీ

ఈ కారణాల నేపథ్యంలో ఈ–చలాన్ల పెండెన్సీ భారీగా పెరిగిపోయింది. 2014–16 మధ్య నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు 101 ఉల్లంఘనలకు సంబంధించి వాహనచోదకులకు 1,03,09,352 చలాన్లు జారీ చేశారు. ఈ–సేవ, మీ–సేవ, కాంపౌండింగ్‌ బూత్, ఆన్‌లైన్, నిర్దేశిత బ్యాంకుల ద్వారా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పించారు. అయితే ఉల్లంఘనులు వీటిలో 60,46,500 చలాన్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన 42,62,852 చలాన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇప్పటికే స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు భారీ మొత్తం పెండింగ్‌లో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పీడీఏ మిషన్ల ద్వారా తనిఖీ చేస్తూ గరిష్టంగా మూడు కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మొత్తం చెల్లించిన తర్వాతే వాహనాన్ని విడిచిపెడుతున్నారు.






ఆర్టీఏలో పక్కాగా లేని చిరునామాలు...

ఈ–చలాన్లను ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌ను అనుసంధానం చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు తమ కంప్యూటర్‌లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్‌ ఎంటర్‌ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్‌ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్‌ ఆ చిరునామాను ఈ–చలాన్‌ జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్టీఏ డేటాబేస్‌లో దాదాపు 50 శాతం చిరునామాలు అప్‌డేట్‌ కాలేదు. దీంతో ఈ చలాన్లు వాహన యజమానికి డెలివరీ కాకపోవడంతో తమ వాహనంపై చలాన్‌ జారీ అయిం దనే విషయం యజమానికి తెలియట్లేదు. మరికొందరు వాహనదారులు చలాన్‌ జారీ అయినట్లు తెలిసినా చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొం టున్నారు. గత మూడేళ్లలో మెగా లోక్‌ అదా లత్‌లు నిర్వహించిన ప్రతిసారీ ప్రచారం చేస్తూ దాదాపు 50శాతం వరకు రాయితీ లు ప్రకటిస్తున్నా ఫలితం కన్పించడం లేదన్నారు.



స్టేటస్‌ తెలుసుకోండిలా...

నగర ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌ (www.htp.gov.in), సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌ (www.ct p.gov.in)లతో పాటు (Hyderabad Traffic Live, Telangana EChallan, Telangana Traffic Police) మొబైల్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారానూ వివరాలు తెలుసుకోవచ్చు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top