నేడు రాష్ట్ర రైతులతో ప్రధాని ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులతో ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని తార్నాకలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నూతన పసుపు వంగడం పీతాంబర్ను ఆవిష్కరిస్తారు. తర్వాత రైతులతో కాసేపు ముచ్చటిస్తారు. పసుపు పంట గురించి చర్చిస్తారు. ఇటీవల లక్నో రీసెర్చ్ సెంటర్లో తయారు చేసిన అధిక దిగుబడినిచ్చే నూతన పసుపు వంగడాన్ని ప్రధాని సమక్షంలో వ్య వసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి రైతులకు అందజేస్తారు.
రాష్ట్రంలో నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో అధికంగా పసుపు సాగు చేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పార్థసారథి తెలిపారు. కార్యక్రమానికి దాదాపు 100 మందికి పైగా రైతులను ఆహ్వానించామన్నారు. ఐఐసీటీ, వ్యవసాయ వర్సిటీ, ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.