రూ.140 కోట్ల కరువు సాయం విడుదల
రాష్ట్రానికి విడుదల చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కరువు సహాయక ప్యాకే జీ కింద కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రాష్ట్రానికి రూ.140.84 కోట్లు విడుదల చేసింది. 2015 ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 359 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రాష్ట్రం రూ.3 వేల కోట్లుపైగా సాయం కోరినా కేంద్రం రూ.434 కోట్లే రాష్ట్రానికి కరువు సహాయక ప్యాకేజీ ప్రకటించింది.
ఇందులో రూ.34 కోట్లు గత నెలలో విదిల్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా 140.84 కోట్లు విడుదల చేసింది. దీంతో మొత్తం రూ.434 కోట్లలో 174.84 కోట్లు విడుదల చేసినట్లయింది. గతేడాది వరదలు, కరువు నష్టాల నేపథ్యంలో జాతీయ విపత్తు సహాయ నిధి కింద (కరువుకు రూ.434 కోట్లు, వరద సహాయం కింద రూ.283 కోట్లు కలిపి) మొత్తం రూ.717 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించింది.