ఖాళీల భర్తీలో ప్రభుత్వం తాత్సారం
ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవటం వల్ల సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో శనివారం దిల్సుఖ్నగర్లో జరిగిన నిరుద్యోగ మహాగర్జనలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగుల రిటైర్మెంటుతో ఏర్పడిన ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకుండా తాత్సారం చేస్తుండటంతో లక్షలాది మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రెండు లక్షల మంది నిరుద్యోగులతో సచివాలయ ముట్టడికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సభలో బీసీ నాయకులు భూపేశ్ సాగర్, చెరుకుల రాజేందర్, నందగోపాల్, రామకృష్ణ, అనంతయ్య, జైపాల్, జయంతి తదితరులు పాల్గొన్నారు.