90 శాతం ప్రైవేట్ అంబులెన్సుల్లో పరికరాల కొరత
హైదరాబాద్: కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు అన్ని వసతులున్న అంబులెన్సుల్లో ఆసుపత్రికి చేరుకోవడం పెనుసవాలుగా మారింది. తెలంగాణలో తిరుగుతున్న ప్రైవేటు అంబులెన్స్లలో తగిన పరికరాలు ఉండడం లేదని వెల్లడైంది. ‘రాష్ట్రంలోని 90 శాతం ప్రైవేటు అంబులెన్సుల్లో తగిన సౌకర్యాలు లేవు. వాటిలో కనీసం ఒక పారామెడికల్ సిబ్బంది కూడా ఉండరు. అవన్నీ రోగిని ఆసుపత్రికి తరలించడానికి తగినవి కాదు’ అని తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల అధ్యక్షుడు పల్లె అశోక్ మీడియాకు వెల్లడించారు. (ఖాకీల్లో దడపుట్టిస్తున్న కరోనా)
బాలానగర్లో నివసించే బి.కనకరాజు భార్యకు పోయిన మంగళవారం ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చింది. ఇంటి ముందుకు అంబులెన్స్ రాగానే, తొందరగా తన భార్యను అందులోకి ఎక్కించారు. కానీ, లోపల కనీసం ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేవు. ‘ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లే ఇతర వాహనాల మాదిరే ఆ అంబులెన్స్ ఉంది’ అని ఆయన వాపోయారు. అదే రోజు సాయంత్రానికి కనకరాజు భార్యకు ఆపరేషన్ పూర్తయి, కోలుకుంటున్నారు. కానీ అలా అత్యవసర సమయంలో వసతులు లేని అంబులెన్సుల్లో ఆసుపత్రికి చేరుకునే లోపు చనిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. (కరోనాతో తెలుగు సినీ నిర్మాత మృతి)
శుక్రవారం నాడు ఓ వ్యక్తి(61)ని అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకురాగా, అంబులెన్సులో ఆక్సిజన్ సిలిండర్ లేక అప్పటికే పరిస్థితి చేయిదాటి ప్రాణాలు వదిలాడు. ఎలాంటి వసతులూ లేని ప్రైవేటు అంబులెన్సులు సైతం హైదరాబాద్లో 20 కిలోమీటర్ల పరిధిలో ఆసుపత్రికి చేర్చినందుకు రూ.9 వేల నుంచి 12 వేల వరకూ వసూలు చేస్తున్నారని బాధితుడి బంధువు సంహిత్ బసూ తెలిపారు.
దీనిపై ఏఎమ్బీయూఎస్ యాప్ ఫౌండర్ ఎన్వీజీ రాజా స్పందించారు. పేషెంట్ను తరలించిన అంబులెన్సులో వెంటిలేటర్ లేదని వెల్లడించారు. కానీ పారామెడిక్ వాడగలిగే ‘అంబూ బ్యాగ్’ ఉందని చెప్పారు. ఇది కూడా వెంటిలేటర్లానే పని చేస్తుందన్నారు.