వ్యవసాయాధార పరిశ్రమలకు ప్రోత్సాహం
వ్యవసాయ మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం పటిష్టతతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రి పోచారం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ప్రాంతాలకు అనుగుణంగా పండే పంటల విస్తీర్ణం, ప్రస్తుతమున్న పరిశ్రమలు, కొత్తగా అవసరమయ్యే పరిశ్రమలపై చర్చ జరిగిందని పోచారం చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలతో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు ఇస్తారనన్నారు. ఆగ్రో యూనిట్ల ద్వారా పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసి మంచి ధరలు వచ్చేలా విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు. 15న మరోసారి సమావేశమై విధివిధానాలు ఖరారు చేసి సీఎం కేసీఆర్కు నివేదిక ఇస్తామని పోచారం పేర్కొన్నారు.