16న ఢిల్లీ నుంచి రానున్న సీఎం
నేడు, రేపు కేంద్రమంత్రులతో భేటీ..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ నుంచి ఈ నెల 16న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. 17న సీఎం పుట్టినరోజు కావడంతో ముందు రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రగతిభవన్లోనే కుటుంబీకులు, మంత్రులు, పార్టీ నేతల సమక్షంలో సీఎం పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. పంటి నొప్పితో బాధ పడుతున్న ముఖ్యమంత్రి చికిత్స కోసం ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లారు. వరుసగా నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో ఉండటంతో పాటు కేంద్ర మంత్రులెవరితోనూ ఆయన భేటీ కాలేదు. బుధ, గురువారాల్లో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన, హైకోర్టు విభజన, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలసి పలు అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను ఢిల్లీకి రమ్మని కబురు పంపించినట్లు సమాచారం.