వాటిని నమ్ముకుంటే బానిసలవుతాం
జాతీయ పార్టీలపై హరీశ్రావు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజల బాధలు పట్టని జాతీయ పార్టీలను నమ్ముకుంటే ఢిల్లీలో బానిసలం అవుతామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అభివృద్ధిని కోరుకునే వారంతా రాష్ట్రంలో టీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని లకారం ట్యాంక్బండ్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజల అవసరాలను గుర్తించలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్లో కూర్చొని, సర్వేల్లో తమకే వంద సీట్లు వస్తున్నాయని పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టుకు చెల్లించాల్సిన రూ.300 కోట్ల ప్రక్రియను పూర్తి చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి జిల్లాలోని ప్రతి గ్రామానికి సాగునీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, హైదరాబాద్ తరహాలోనే ఖçమ్మంలో రింగ్రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇందుకోసం రూ.180 కోట్లు కేటాయించారని తెలిపారు. దేశంలోనే రోడ్ల నెట్వర్క్లో నంబర్వన్గా తీర్చిదిద్దబోతున్నట్లు వివరించారు.
మంత్రి హరీశ్రావు చాలెంజ్గా తీసుకుని నిర్మిస్తున్న కాళేశ్వరం తరహాలనే సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ట్యాంక్బండ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలో 5కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ లోకేశ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పాల్గొన్నారు.