చేపా.. చేపా.. నీ బరువెంత?
మార్కెట్కు పోయాం.. 2 కిలోల చేపలు కొన్నాం.. అమ్మినోడు దాన్ని ముక్కలు చేసి ఇస్తే.. ఇంటికొచ్చి వండుకున్నాం.. మరి మనం కొన్నది 2 కిలోల చేపలేనా? లేదా 2 కిలోలు అని చెప్పి.. కిలోన్నర ఇచ్చాడా? ఇలాంటి బాగోతం మీదే ఇటీవల ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘తూచేస్తున్నారా? దోచేస్తున్నారా?’అనే కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనానికి తూనికలు, కొలతలు శాఖ స్పందించి.. ప్రత్యేక బృందాలతో వరుస దాడులు చేసింది.
బుధవారం తూనికల కొలతల శాఖ హైదరాబాద్ ఇన్స్పెక్టర్ సంజయ్ కృష్ణ ఆధ్వర్యంలో రామ్నగర్ చేపల మార్కెట్లో తూకాల మోసాలపై వినియోగదారులకు అవగాహన కూడా కల్పించారు. అంతేకాదు.. సరిగ్గా బరువును తెలుసుకునేందుకు ఓ వేయింగ్ మెషీన్ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో వినియోగదారులు తాము కొనుగోలు చేసిన చేపలను ముందుగా ఈ తూకంపైనే బరువు చూసుకున్నారు. అధికారులే ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో చేపల వ్యాపారులు కూడా కొంచెం జాగ్రత్తపడినట్లు కనిపించింది. – సాక్షి, సిటీ బ్యూరో