ఈ మేస్టార్లు డూప్లికేట్లు

ఈ మేస్టార్లు డూప్లికేట్లు


హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో బినామీ ఉపాధ్యాయుల రాజ్యం నడుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10 నుంచి 15వేల మంది బినామీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని విద్యాశాఖ వర్గాలే అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాల, ఇద్దరితో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ బినామీల వ్యవహారం జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు బయట వేరే వ్యాపారాలో, ఇతరత్రా వ్యవహారాలో చూసుకుంటూ ఉద్యోగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.


ప్రతినెలా ప్రభుత్వం నుంచి 40వేలనుంచి 50వేల వరకు జీతంగా పొందుతూ పాఠశాలలకు రాకుండా తమ స్థానాల్లో బినామీలతో పాఠాలు చెప్పిస్తున్నారు. బినామీలకు కేవలం రూ.3వేలనుంచి 5వేల వరకు చెల్లిస్తూ స్కూళ్లకు రాకుండానే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా దర్జాగా చలామణి అయిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు ఏకంగా అయిదేళ్లుగా పాఠశాలకు రావడం లేదని, ఆయన స్థానంలో రూ.2,300 జీతంతో బినామీ టీచరును పెట్టారని తాజాగా గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.


ఈ వ్యవహారంపై ఆ జిల్లా డీఈఓ విచారణ చేసి పాఠశాల విద్యాశాఖకు సమాచారం పంపారు. ఇలా వెలుగులోకి వస్తున్న సంఘటనలు కొన్ని మాత్రమే కాగా బయటకు రానివి వేలల్లోనే ఉంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో స్కూళ్లు బినామీలతోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3,04,021 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో కనిష్టంగా 3 నుంచి 5 శాతం వరకు ఉపాధ్యాయులు బినామీలతో పాఠాలు చెప్పిస్తూ.. తాము ఇతరేతర వ్యాపారాలు చేసుకుంటున్నారు.

 

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేమి

పర్యవేక్షణ లే మితో పాటు, ఎంఈఓలు ఇతర పర్యవేక్షణాధికారుల అవినీతి అక్రమాల వల్లనే ఈ బినామీ ఉపాధ్యాయుల వ్యవహారం రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిపోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో మండలస్థాయిలో స్కూళ్లను పర్యవేక్షించాల్సిన  మండల విద్యాధికారుల (ఎంఈఓ) పోస్టులు రెండు దశాబ్దాలుగా శాశ్వత అధికారులు లేక ఇన్‌ఛార్జులతో కొనసాగుతున్నాయి. దీంతో స్కూళ్లలోని పరిస్థితులను పర్యవేక్షించేవారు కరువయ్యారు.


ఇన్‌ఛార్జి అధికారులుగా ఉన్న సీనియర్ హెడ్మాస్టర్లు అటు స్కూలు, ఇటు మండల బాధ్యతలు చూడలేకపోతున్నారు. దీంతో స్కూళ్లకు ఎగ్గొట్టే వారిదే ఇష్టారాజ్యంగా మారింది. ఎంఈఓలు, ఇన్‌చార్జులకు నెలవారీగా కొంతమొత్తాన్ని ముట్టచెబుతూ పాఠశాలలకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా రికార్డుల్లో హాజరు నమోదు చేయించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో అయిదేళ్లుగా బినామీ టీచర్‌తోనే స్కూలును నడిపించిన ఘనుడే దీనికి తార్కాణం. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని స్కూళ్లలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్యాశాఖ రికార్డుల్లో ఈ స్కూళ్లకు టీచర్లు నియామకమైనట్లు ఉన్నా వాస్తవానికి అక్కడికి వెళ్లే నాథుడే లేడు.




తొమ్మిదివేలకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలే!

విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్  పాఠశాలలు 61,962 వరకు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 40,703, ప్రాథమికోన్నత పాఠశాలలు 10,100, హైస్కూళ్లు 11,149 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు 8,832, ఇద్దరు ఉపాధ్యాయులున్న స్కూళ్లు 15,889 మంది, ముగ్గురు టీచర్లున్న స్కూళ్లు 4,143 ఉన్నాయి.


ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏకోపాధ్యాయ స్కూళ్లు 127, ఇద్దరు టీచర్ల స్కూళ్లు 480, ముగ్గురే ఉన్న స్కూళ్లు 623 ఉన్నాయి. ఏకోపాధ్యాయ స్కూళ్లు, ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో బినామీలు ప్రతి జిల్లాలో ఉన్నారు. ‘‘అన్ని జిల్లాల్లో ఈ బినామీ టీచర్లను నియమించుకొని ప్రభుత్వ టీచర్లు పాఠశాలలకు డుమ్మా కొడుతున్నారు. పర్యవేక్షణ లేమి, లంచాల వల్ల  ఈ వ్యవహారాలు బయటకు రావడం లేదు’’ అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top