5న హైదరాబాద్‌లోనే ఉంటా.. ఆ రోజే సమాధానమిస్తా

5న హైదరాబాద్‌లోనే ఉంటా.. ఆ రోజే సమాధానమిస్తా - Sakshi


సీపీఐ నేత నారాయణ

చాంద్రాయణగుట్ట: ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లోనే ఉంటానని, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్‌కు సమాధానమిస్తానని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు నారాయణ అన్నారు. ‘టీఆర్‌ఎస్ ఒంటరిగా మేయర్ పీఠం గెలుచుకుంటే చెవులు కోసుకుంటానని నారాయణ అన్నారు. నారాయణ గారు మీరు 5న హైదరాబాద్‌లో ఉండకండి. మళ్లీ ఎవరైనా మీ చెవులు కోస్తే ఎలా’ అని కేసీఆర్ శనివారం బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నారాయణ పైవిధంగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీపీఐ గౌలిపురా డివిజన్ అభ్యర్థి వి.అన్నపూర్ణా దేవి తరఫున నారాయణ ఆదివారం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. తాను ఎవరికి భయపడేది లేదని, 5న నగరంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక స్పందిస్తానన్నారు. పారదర్శక పాలన కోసం వన్ కూటమికే ఓటేయాలని ప్రజలను కోరారు. అనంతరం లలితాబాగ్ డివిజన్ అభ్యర్థి ఆలేటి యాదగిరితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు బి.రాములు యాదవ్, చంద్రమోహన్ గౌడ్, మహేందర్ తదితరులున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top