ప్రఖ్యాత కార్టూనిస్ట్‌ మోహన్‌ ఇకలేరు!

ప్రఖ్యాత కార్టూనిస్ట్‌ మోహన్‌ ఇకలేరు! - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్, పత్రికా రచయిత మోహన్‌ ఇకలేరు. జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. ఆయనకు కుమారుడు ఉన్నారు.



మోహన్‌ పూర్తిపేరు తాడి మోహన్‌. 1951, డిసెంబర్‌ 24న ఏలూరులో ఆయన జన్మించారు. 1970లో విశాలాంధ్ర పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించిన మోహన్‌.. అనంతరం ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల్లో పనిచేశారు. సాక్షి మీడియాతో మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. సాక్షి టీవీలో కార్టూన్‌ యానిమేషన్‌ విభాగంలో ఆయన సేవలందించారు. పొలిటికల్ కార్టూనిస్ట్‌గా మోహన్ తెలుగు పత్రికా రంగంలో చూపిన ప్రభావం అపారం. వ్యంగ్య చిత్రాలలో గీయడంలో మోహన్‌ది ప్రత్యేకమైన శైలి. ఆయన కార్టూన్‌లు, బొమ్మలు తెలుగునాట విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. మోహన్‌ గొప్ప పొలిటికల్‌ కార్టూనిస్ట్‌ అని, మంచి ఆలోచనపరుడు, రాజకీయాలపై గట్టి పట్టున్నవారు అని, ఆయన తనకు మంచి స్నేహితుడు అని 'సాక్షి' ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కే రామచంద్రమూర్తి సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కూడా కార్టూనిస్ట్‌ మోహన్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top