అమిత్షా పర్యటన షెడ్యూల్ ఖరారు
22 నుంచి 24 వరకు నల్లగొండ జిల్లాలో
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మూడురోజుల నల్లగొండ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22న ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తర్వాత 11.15కు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.45 నిమిషాలకు నల్లగొండ జిల్లా చండూరు మండలం, తేరేటుపల్లి గ్రామా నికి చేరుకుంటారు. ఈ గ్రామంలో గతం లో నక్సల్స్ చేతిలో మృతిచెందిన గుండ గోని మైసయ్యగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిస్తారు.
ఈ గ్రామంలోనే ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొం టారు. అక్కడి ఎస్సీబస్తీలోని దళితుల ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. 3.30 గంటలకు నల్లగొండలోని బీజేపీ కార్యాల యానికి చేరుకుంటారు. సాయంత్రం హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన 400 మంది మేధావులతో సమావేశమవుతారు. అనంతరం రాష్ట్ర పార్టీ పదాధికారులు, 31 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. రాత్రి పార్టీ ఆఫీసులోనే బసచేస్తారు.
23న పర్యటన వివరాలు...
ఉదయం 9.15 గంటలకు నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామంలోని దళిత బస్తీలో పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ తో పాటు ఆ బస్తీకి దీన్దయాళ్నగర్గా నామకరణం చేస్తారు. ఉదయం 10.50 గంటలకు నాగార్జునసాగర్ నియోజక వర్గంలోని పెద్ద దేవులపల్లి గ్రామంలో పోలింగ్బూత్ కమిటీ సభ్యులతో సమావేశ మయ్యాక ఆ గ్రామ ప్రజలను కలుసుకుం టారు. సాయంత్రం 4 –5 గంటల మధ్య నల్లగొండలో విలేకరులతో మాట్లాడతారు.
24న గుండ్రాంపల్లిలో పర్యటన...
ఉదయం 9.45 నిముషాలకు చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామాన్ని చేరుకుంటారు. గతంలో నిజాం పాలనలో రజాకార్ల ప్రైవేట్ సైన్యం చేతుల్లో 150 మందిని చంపి ఒక బావిలో పడేసిన ప్రాంతాన్ని సందర్శించి మృతులకు నివాళి అర్పిస్తారు, అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు భువనగిరి జిల్లాలోని భువనగిరికి చేరుకుని తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది మేధావులు, వివిధరంగాల ప్రముఖులతో సమావేశ మవుతారు. అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్లో భోజనం చేసి, సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బూత్స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. రాత్రి హరితప్లాజాలో బసచేస్తారు. 25న ఉద యమే విజయవాడ వెళతారు.