గప్‌చుప్‌గా గృహ ప్రవేశం

గప్‌చుప్‌గా గృహ ప్రవేశం - Sakshi


- అడుగడుగునా పోలీస్‌ పహారా.. ఇంటికెళ్లే మార్గంలో 26 సీసీ కెమెరాలు

- మీడియా అడ్డగింత.. సెల్‌ఫోన్‌లో తీసిన ఇంటి ఫొటోల తొలగింపు

- అతికొద్దిమంది బంధువులకే ఆహ్వానాలు

- తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు

- కొద్దిసేపు విశ్రాంతి కోసం పార్క్‌హయత్‌కు వెళ్లిన బాబు

- రాత్రికి మళ్లీ ఇంటికి.. అక్కడే నిద్ర  




సాక్షి, హైదరాబాద్‌: అడుగడుగునా పోలీసుల పహారా మధ్య అత్యంత రహస్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు నూతన గృహప్రవేశం చేశారు. చూపరుల కళ్లు చెదిరేలా.. ఇంద్రభవ నాన్ని తలపించేలా అత్యంత విలాసవంతంగా హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇంటిలోకి ఆదివారం తెల్లవారు జామున అడుగుపెట్టారు. చంద్రబాబు కుటుంబంతో పాటు తన వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబం, మరో మూడు అతి సన్నిహిత కుటుంబాల మధ్య ఖరీదైన భవనంలో వాస్తుపూజ, యజ్ఞంతో పాటు ఇతర వ్రతాలను నిర్వహించారు.



తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పూజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం విశ్రాంతి కోసం ఇప్పటి వరకూ ఆయన కుటుంబం నివసించిన పార్క్‌హయత్‌ హోటల్‌కు వెళ్లారు. అక్కడ చంద్రబాబుతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ భేటీ అయినట్టు తెలిసింది. దాదాపు రెండు గంటలపాటు మంతనాలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. తిరిగి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు చంద్రబాబు తన నూతన గృహానికి చేరుకుని అక్కడే భోజనం చేసి రాత్రి నిద్ర చేశారు. చంద్రబాబు గృహ ప్రవేశ వేడుకకు ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులు, మంత్రులు, ఎంపీ, ఎంఎల్‌ఏలకు ఆహ్వానం లేకపోవటంతో ఎవరూ ఆ వైపు కూడా చూసే సాహసం చేయలేదు.



ఇంటి చుట్టూరా పోలీస్‌ పహారా.. మీడియా అడ్డగింత: చంద్రబాబు నివాసానికి వెళ్లే రోడ్‌ నంబర్‌ 65ను ఏపీ పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇంటి చుట్టూరా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఆ మార్గంలో ఏకంగా 26 సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి బాబు ఇంటికి అనుసంధానం చేశారు. చాలా కాలంగా ఏపీకి చెందిన ప్రత్యేక పటాలంతో పాటు పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు తోడు ఇంటలిజెన్స్‌ సిబ్బంది అక్కడే మకాం వేసి ఉన్నారు. బాబు గృహ ప్రవేశాన్ని కవర్‌ చేసేందుకు వచ్చిన వివిధ ఛానెళ్లు, పత్రికల ప్రతినిధులను రోడ్డుపైనే నిలిపేసి అనుమతి లేదంటూ వెనక్కి పంపారు. సెల్‌ఫోన్‌లో బాబు నివాసాన్ని చిత్రీకరించిన జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు లాక్కొని ఫొటోలను తొలగించడం గమనార్హం.



ఆద్యంతం విలాసవంతం  

హైదరాబాద్‌లోనే అతి ఖరీదైన జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 65లోని 1309, 1310 ప్లాట్‌ నంబర్లలో 2,479 గజాల విస్తీర్ణంలో నిర్మించిన చంద్రబాబు నూతన గృహంలో నిర్మాణాలు, కళాఖండాలు, ఇంటీరియర్లన్నీ కళ్లు చెదిరేలా ఉన్నాయని వివిధ పనుల నిమిత్తం ఆదివారం భవనంలోనికి వెళ్లి వచ్చిన వారు పేర్కొన్నారు. ముఖ్యంగా విశాలమైన కాన్ఫరెన్స్‌ హాళ్లు, లైబ్రరరీ, వీఐపీ లాంజీలు, భోజనశాలలు, టెర్రస్‌పై అరుదైన విదేశీజాతి మొక్కలతో రూపొందించిన పచ్చికబయలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. ఇంటి లోపల వినియోగించిన పరికరాలన్నీ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కావటంతో భవనం ఇంధ్రభవనాన్ని తలిపించిందని చెప్పారు..



నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షాల తో చర్చించేందుకు ఎన్‌డీఏ సమావేశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనేందుకోసం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top