‘మా నాన్నని నేనే చంపాను’

Story On Son Kills Father To Protect His Mother - Sakshi

క్రైమ్‌ స్టోరీ

కాలుష్యాన్ని కర్కశంగా వెదజల్లుతున్న సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఎర్రన్న కళాసీగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం చిన్నదైనా అది ప్రభుత్వ ఉద్యోగం కావడంతో డబ్బులకేమీ లోటు లేదు. భవిష్యత్తుకు సంబంధించిన చింత లేదు. ప్రారంభంలో లేదు గాని ఈ మధ్యే ఎర్రన్న తాగుడుకు అలవాటుపడ్డాడు. మందు కొట్టడమనేది నిత్యకృత్యమైపోయింది. ఇంటికి రావడం రావడమే విపరీతంగా తాగి రావడం, అల్లరి చేయడం రోజూ మామూలైపోయింది. ఎప్పటిలాగే తాగి వచ్చి, ఇంట్లో కోడికూర, మేకకూర లేదని రభస చేసి, మేడపైకి వెళ్లి పడుకున్నాడు.

వేసవిలో మేడపైన ఓపెన్‌లో నిద్రపోవడం ఆ ప్రాంతంలో అందరికీ అలవాటే.
ఎర్రన్నతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వరుసగా దుప్పట్లు పరుచుకుని, తలగడలు పేర్చుకుని నిద్రకు ఉపక్రమించారు. చల్లనిగాలి వీస్తుండటంతో తొందరగానే నిద్రాదేవత వారినందరినీ గట్టిగా ఆవహించేసింది. మత్తుగా నిద్రపోయారంతా! 
ఉదయం నాలుగింటికి లేవటం ఎర్రన్న భార్య బంగారమ్మకి అలవాటు. ఉదయమే పిల్లలకీ, మొగుడికీ టిఫిన్‌లూ, భోజనం క్యారియర్‌లు సిద్ధం చేయటం ఆమె దినచర్యలో భాగమే! ఆ రోజు కూడా యథావిధిగా పెందలాడే లేచింది. లేచిన వెంటనే భర్త ముఖం చూడటం ఆమెకి సెంటిమెంట్‌... అలాగే ఎర్రన్న వైపు చూసింది. ఎర్రన్న కనిపించలేదు. ఆశ్చర్యపోయింది. బాత్‌రూమ్‌లో ఉన్నాడేమోనని వెదికింది.
అక్కడ కూడా లేడు.
గాభరా పడింది. ఆతృతగా ఇంట్లో నుంచి వాకిట్లోకి పరుగులు తీసింది. ఎదురుగా ఎర్రన్న!
వాకిట్లో బోర్లా పడున్నాడు. ముఖాన్ని వెనక్కు తిప్పి చూసింది. మత్తులో ఉన్నాడేమోనని ముఖంపై నీళ్లు చల్లింది.
ఎర్రన్న అచేతనంగా పడి ఉన్నాడని, ప్రాణం ఎప్పుడో పోయిందని ఆమె తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. పట్టరాని దుఃఖం ముంచుకొచ్చింది. భోరున విలపించింది. ఆమె ఏడుపు విని ఎదురింటి వారు, ఇరుగు పొరుగు వారు, మేడపై నిద్రపోతున్న కొడుకు రమేష్, కూతురు సీత పరుగెత్తుకు వచ్చారు.
ఎలా చనిపోయాడో ఎవరికీ అర్థం కావట్లేదు. కిందికొచ్చి కుప్పకూలిపోయాడా, మేడపైనుంచి పొరపాటున జారిపడ్డాడా– అంతా అయోమయంగానే ఉంది. అందరికీ సమాచారం పంపారు. ఈలోగా అందరితోపాటు సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికసంఘ నాయకుడు మసేన్‌రాజు కూడా వచ్చాడు.

‘‘జరిగిందేదో జరిగిపోయింది. పోయినవాడిని తిరిగి బతికించలేము. వాడితోపాటు మనమూ చావలేము. ఇప్పుడు ఎర్రన్న కుటుంబం అనాథలైంది. ఆ ఉద్యోగం మీద వచ్చే జీతం మీద బతికే ఆ కుటుంబం వీధిన పడింది. పిల్లలు కూడా ఇంకా ఏరకంగానూ స్థిరపడలేదు. ఎర్రన్న ఉద్యోగం వారి పిల్లల్లో ఎవరో ఒకరికో లేదా అతని భార్యకో వస్తే ఆ రకంగా వాళ్లు నిశ్చింతగా బతకగలుగుతారు. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీకిష్టమైతే ఆ రకంగా చేద్దాం...’’ కుటుంబ సభ్యులకీ, కొందరు ముఖ్యులకీ విషయం చెప్పాడు. అందరూ అందుకు సరేనన్నారు.
ఎర్రన్న అంత్యక్రియలకు చెయ్యాల్సిన ఏర్పాట్లను నిలిపివేశారు.
అంబాసిడర్‌ కారును రప్పించారు. కారు డిక్కీలో ఎర్రన్న శవాన్ని పడేశారు. ఆ తర్వాత కారు సరాసరి సిమెంట్‌ ఫ్యాక్టరీలోనికి దూసుకెళ్లింది. యంత్రాలు చకచకా తిరుగుతున్నాయి. దాంట్లో కన్వేయర్‌ బెల్ట్‌ వద్దకు శవాన్ని మోసుకెళ్లి దానిపై పడేశారు. సిమెంట్‌ బూడిదతో పాటు ఎర్రన్న శవం కూడా నేలమీద ముక్కలు పడింది.
‘‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదవశాత్తు యంత్రంలోకి జారిపడిన ఎర్రన్న కుటుంబానికి న్యాయం జరగాలి.. వారింట్లోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. కామ్రేడ్‌ ఎర్రన్న అమర్‌ రహే..’’ నిరసన ధ్వనులు మిన్నంటాయి.
ఈ విషయమై కార్మికులంతా ధర్నాకు దిగారు. ఉత్పత్తి స్తంభించిపోయింది. దాంతో యాజమాన్యం చర్చలకు పిలిచింది.
‘‘కంపెనీ రూల్స్‌ ప్రకారం ఏం చెయ్యగలమో అదంతా చేస్తాం. వారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. శవం ఇంకా అక్కడే ఉంటే కార్మికులు భయపడే వాతావరణం, భీతావహ స్థితి ఏర్పడుతుంది. దాన్ని అధిగమించేందుకు దయచేసి వెంటనే శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోండి..’’ సానుకూలంగా యాజమాన్యం ప్రతిపాదన తీసుకు రావడంతో.. అంతా అక్కడినుంచి నిష్క్రమించారు.
ఉత్పత్తి యథావిధిగా ప్రారంభమైంది.

ఇలాంటి సంఘటనలు ఈమధ్య తరచు జరగటం, ఫ్యాక్టరీలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, భద్రత లోపించిందని– ఉన్నత యాజమాన్యం దృష్టికి వచ్చింది. దాంతో రహస్యంగా నిఘా ఏర్పాటు చేసింది. ఆ విషయం ఇంకా ఉద్యోగులకుగాని, కార్మిక నాయకులకుగాని తెలియదు. నిఘా బృందం పరిశీలనలో నమ్మలేని నిజాలు బయటికొచ్చాయి. వెంటనే యాజమాన్యం రంగంలోకి దిగింది. ఇంకా ఉపేక్షించడం మంచిది కాదనే నిర్ణయానికొచ్చింది. ఈ కేసు విషయమై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు డిటెక్టివ్‌ సాయంతో విచారణ ప్రారంభించారు. తమదైన శైలిలో పరిశోధన చేశారు.
ఎర్రన్న భార్యను అదుపులోకి తీసుకోగానే గడగడా విషయమంతా చెప్పేసింది. ఎర్రన్న చనిపోయాక ఏడుస్తుంటే, కార్మిక నాయకుడు మసేన్‌రాజు ఇచ్చిన సలహా, దాని ప్రకారం ఫ్యాక్టరీ లోపలికి శవాన్ని మోసుకురావడం పూసగుచ్చినట్లు చెప్పేసింది.
‘‘ఇదంతా సరే... అసలు ఎర్రన్నను చంపిందెవరు? ఆ విషయమే నిజం చెప్పు...’’ పోలీసు లాఠీ బంగారమ్మ తల చుట్టూ తిరగసాగింది. గిరగిరా తిప్పుతున్న ఎస్సైని చూస్తేనే పైప్రాణం పైనే పోయేలాగుందన్న భయం కలుగుతోంది.
‘‘నా భర్తని చంపారా? ఎవరు?..’’ ఆశ్చర్యపోతూ అడిగింది.
‘‘ఇంకెవరు? నువ్వే..’’ కర్కశంగా నవ్వాడు ఎస్సై. కడుపులో పిడిగుద్దులు గుద్దింది మహిళా కానిస్టేబుల్‌. నొప్పిని తట్టుకోలేక భీకరంగా అరిచింది బంగారమ్మ.
‘‘నేనా.. ఎంత ఘోరం! నా భర్తను చంపుకుంటానా? ఏమైనా న్యాయంగా ఉందా?’’ వలవలా ఏడ్చేసింది మహిళా కానిస్టేబుల్‌ మరోసారి పిడిగుద్దులు కురిపించింది. భరించలేని బాధతో బంగారమ్మ నేలమీద వాలిపోయింది.
ఇదంతా ఎర్రన్న పిల్లల ఎదురుగానే జరిగింది. ఎర్రన్న కొడుకు రమేష్‌ రక్తం లావాలా పొంగుతోంది. తన తల్లిని కొడుతున్న కానిస్టేబుల్‌ని కసితీరా కొట్టాలనిపించింది. తన శక్తి మేరకు సినిమాలో హీరోలా వాళ్లందరినీ చావబాదాలనిపించింది.
కాని ఎదురుగా డజనుకుపైగా పోలీసులు. తానొక్కడూ ఏమీ చేయలేడు. ఏ పాపమూ ఎరుగని తల్లిని హింసిస్తుంటే చూడలేకపోతున్నాడు. తానే ఆ తప్పు చేశానన్న విషయాన్ని ఒప్పేసుకోవాలనుకున్నాడు. పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు.

‘‘అవును! మా నాన్నని నేనే చంపాను. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. అమ్మని కొట్టేవాడు. మేం అందరిలా ప్రశాంతంగా చదువుకుందామనుకుంటే రోజూ ఏదోరకంగా డిస్టర్బ్‌ చేసేవాడు. ఈ మధ్య జీతం కూడా ఇంటికి ఇవ్వకుండా, పూర్తిగా తాగేస్తున్నాడు. స్కూలు ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం. ఇంట్లో తిండికి కూడా డబ్బుల్లేక అమ్మ ఇబ్బంది పడుతోంది. పొరుగింటి వాళ్ల ముందు చులకన అవుతున్నాం. నాన్న చనిపోతే ఉద్యోగం వచ్చినా, రాకపోయినా కంపెనీ నుంచి లక్షల్లోనే సొమ్ము చేతికొస్తుంది. దాంతో బాగా చదివి, మంచి ఉద్యోగంలో సెటిల్‌ కావచ్చనే ఇంత పనీ చేశాను. ఆరోజు రాత్రి అందరూ మత్తుగా నిద్రపోయారు. నేను మాత్రం నిద్రపోలేదు.

సరిగ్గా అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో నిద్రపోతున్న నాన్న ముఖంపై తలగడతో అదిమాను. ఊపిరాడక కాసేపు గింజుకున్నాడు. ఆ తర్వాత ప్రాణం వదిలాడు. మా మేడపై శ్లాబ్‌కి పిట్టగోడ లేదు. అందుకే సులువుగా నాన్నను బయటకు లాగి, కిందకు తోసేశాను. నిద్రమత్తులో జారిపడి ఉంటాడని అందరూ అనుకుంటారని నమ్మాను. కాని ఈ రకంగా జరుగుతుందని ఊహించలేకపోయాను. ఇది పూర్తిగా నా నిర్ణయం. ఈ చర్యతో మా కుటుంబ సభ్యులెవరి ప్రమేయమూ లేదు. మా అమ్మకు అసలేమీ తెలీదు..’’
రమేష్‌ నేరం ఒప్పుకోవడంతో చేతికి బేడీలు పడ్డాయి. భర్తనీ, కొడుకునీ దూరం చేసుకున్న బాధతో బంగారమ్మ మరోసారి మూర్ఛపోయి ఆస్పత్రి పాలైంది. రమేష్‌తో పాటు, కార్మిక నాయకుడిని కూడా అరెస్టు చేశారు.
- డా.ఎం.వి.జె.భువనేశ్వరరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top