విప్లవోద్యమంలో బెంగాల్‌ బెబ్బులి

Jatindranath Mukherjee Life Story - Sakshi

ధ్రువతారలు

1908 నాటి ఘటన ఇది. జరిగిన చోటు– బెంగాల్‌లోని  సిలిగుడి రైల్వే స్టేషన్‌. కొందరు ఇంగ్లిష్‌ అధికారులని ఒక భారతీయుడు చావగొట్టి వదిలిపెట్టాడు. దీని మీద కేసు నమోదైంది. ఒకే ఒక్క భారతీయుడు కొందరు శ్వేతజాతీయులకి ఒంటి చేత్తో కళ్లు బైర్లు కమ్మేటట్టు చేశాడంటే ఎంత పెద్ద వార్త. పత్రికలు పోటీపడి ప్రాధాన్యం ఇచ్చాయి. విచారణ జరుగుతున్నంత కాలం అదే పనిలో ఉన్నాయి. ఇదంతా చూశాక పరువు తక్కువ అని కేసు మూయించేశారు అధికారులు. ఎందుకంటే ఒంటరి భారతీయుడి చేతిలో అంతమంది అధికారులు చావు దెబ్బలు తిన్నారంటే రవి అస్తమించని సామ్రాజ్యానికి, బ్రిటిష్‌ చక్రవర్తికి ఎంత అప్రతిష్ట!  పైగా దెబ్బలు తిన్న వాళ్లంతా సైనికాధికారులు కావడం మరొక విశేషం. మహిళలకు ఇబ్బంది కలిగించవద్దని సగౌరవంగా కోరినా జాత్యహంకారం చూపినందుకు, అవమానకర భాషతో తనను దూషించినందుకు ఆ యువకుడు ఆ సాహసం చేశాడు. ఇంతటి దేహబలం కలిగిన ఆ భారతీయుడి పేరు ‘బఘా’ (పెద్దపులి) జతీన్‌. పూర్తిపేరు జతీంద్రనాథ్‌ ముఖర్జీ.

జతీన్‌ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వేగుచుక్క. విప్లవ స్రష్ట, ద్రష్ట. బ్రిటిష్‌ పాలన మీద విప్లవించడానికి మొత్తం భారతదేశాన్ని కదిలించాలని మొదటిసారి ఆలోచించినవారు జతీన్‌. ఈ పనిలో జర్మనీ సాయం తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం చిరస్మరణీయమైనది. రామకృష్ణ పరమహంస, వివేకానంద బోధనలు, శిష్యరికంతో ఆయన తన జాతీయవాద దృష్టిని మలచుకున్నారు. ఆధ్యాత్మికత ఆధారంగా సాంస్కృతిక జాతీయవాదాన్ని ఆశించారాయన. అరవిందుల ఆదేశంతో విప్లవ సంస్థను స్థాపించారు. రాస్‌ బిహారీ బోస్, ఎంఎన్‌ రాయ్‌ వంటివారి సాహచర్యంతో జతీన్‌ విప్లవ పంథాలో నడిచారు. ఆర్థిక పరిపుష్టితో, రాజకీయ స్వేచ్ఛతో, మౌఢ్యం లేని ఆధ్యాత్మిక చింతనతో ఈ దేశం పరిఢవిల్లాలని ఆకాంక్షించారాయన.

జతీంద్రనాథ్‌ ముఖర్జీ (డిసెంబర్‌ 7, 1879–సెప్టెంబర్‌ 10, 1915) ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న కయాగ్రామ్‌  (నాడియా జిల్లా)లో పుట్టారు. తండ్రి ఉమేశ్‌చంద్ర ముఖర్జీ, తల్లి శరత్‌శశి. ఈమె కవయిత్రి. తన పిల్లలను ఎంత ప్రేమగా చూసేవారో, అంత అదుపులోనూ ఉంచేవారు. ఆమె నుంచి జతీన్‌ చిన్నతనంలోనే పురాణ కథలను విన్నాడు. బహుశా తల్లి మాటలలోనే మాతృభూమికి పట్టిన దుస్థితికి గురించి ఆయనకు అవగాహన కలిగి ఉండాలి. పురాణ గాథలతో పాటు బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ గొప్పతనం కూడా అమ్మ నోటి నుంచే జతీన్‌ విన్నాడు. అలాగే మరొక ప్రముఖ రచయిత యోగేంద్ర విద్యాభూషణ్‌ (ఇటలీ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డి జీవితాలను బెంగాలీలకు పరిచయం చేసినవారు) గురించి కూడా తల్లి చెప్పేది.

మేనమామ బసంత్‌కుమార్‌ ఛటోపాధ్యాయ న్యాయవాది. రవీంద్రనాథ్‌ టాగోర్‌ ఆయన క్లయింట్‌. అప్పటికే టాగోర్‌  స్త్రీలకు సమాన స్థానం కల్పించడం గురించి ప్రజలలో చైతన్యం రేకెత్తించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఐదో ఏటనే జతీన్‌ తండ్రిని కోల్పోయారు. అయినా ఒక అందమైన, ఆదర్శనీయమైన బాల్యాన్ని ఆయన గడిపారు. బొమ్మలు గీసేవారు. పెద్దలు, వృద్ధుల పట్ల ఉదారంగా ఉండేవారు. పౌరాణిక నాటకాలు, ఆ పాత్రలు అంటే ఆరాధించేవారు. కిషన్‌నగర్‌లోని ఆంగ్లో వెర్నాక్యులర్‌ స్కూల్‌లో చదువు అయిన తరువాత కలకత్తా సెంట్రల్‌ కాలేజీలో ఫైన్‌ ఆర్ట్స్‌ చదవడానికి చేరారు. అప్పుడే బెంగాల్‌లో ప్లేగు వ్యాధి వచ్చింది. సిస్టర్‌ నివేదిత బాధితుల కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవకులను పిలిచి సేవలు చేసేవారు. అలా బాధితులకు సేవ చేయడానికి వెళ్లినప్పుడే నివేదిత జతీన్‌ను వివేకానందకు పరిచయం చేశారు.

ఈ దేశానికి సేవలు అందించడానికి ‘ఇనుప కండరాలు,ఉక్కు నరాలు’ కలిగిన యువకుల బృందాన్ని సిద్ధం చేయమని నేరుగా వివేకానందులే యువ జతీన్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆంగ్లేయ విద్యా విధానం మీద సహజంగానే ఏవగింపు ఆరంభమైంది. చదువు వదిలి పెట్టి 1899లో ముజఫర్‌పూర్‌ వెళ్లిపోయారు. అక్కడ రచయిత, ‘త్రిహూత్‌ కొరియర్‌’ పత్రికా సంపాదకుడు, చరిత్రకారుడు, బారిస్టర్‌ ప్రింగీల్‌  కెన్నెడీ దగ్గర కార్యదర్శిగా చేరారు. కెన్నెడీ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే ఆంగ్లేయుడు. తన పత్రిక సంపాదకీయాలలోను, జాతీయ కాంగ్రెస్‌ సభలలోను కూడా భారత్‌లో జరుగుతున్న బ్రిటిష్‌ దోపిడీ గురించి, భారత జాతీయ సైన్యం ఏర్పడవలసిన అవసరం గురించి మాట్లాడేవారు. ఇది కూడా జతీన్‌ను ఉత్తేజపరిచేది.

1900 సంవత్సరంలో జతీన్, ఇంకొందరు యువకులు కలసి ‘అనుశీలన్‌ సమితి’ సంస్థను ఏర్పాటు చేశారు. 1903లో అరవిందులను కలసినప్పుడు రహస్య సంస్థలను స్థాపించమని ఆయన నుంచి సలహా అందింది. ‘జుగాంతర్‌’ అలాంటి సంస్థే. ‘అనుశీలన్‌ సమితి’ పైకి వ్యాయామశాలలు నిర్వహించే సంస్థ. కానీ అసలు ఉద్దేశం బ్రిటిష్‌ పాలన మీద సాయుధ పోరాటం చేసే యువతను సమీకరించడమే. బీరేంద్ర ఘోష్‌తో కలసి దేవ్‌గఢ్‌ అనేచోట బాంబుల నిర్మాణ కేంద్రం కూడా స్థాపించారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాలను దోచేవారు. ఆయన మీద పెట్టిన హౌరా–శిబ్‌పూర్‌ కేసు ఇందుకు సంబంధించనదే. కానీ సరైన ఆధారాలు లేక కేసు కొట్టేశారు.

1900 సంవత్సరంలో ఇందుబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు– అతీంద్ర, ఆశాలత, తేజేంద్ర. కానీ 1903లో పుట్టిన పెద్దకొడుకు మూడేళ్లకే కన్నుమూయడంతో » ఘా జతీన్‌ తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయారు. అదే తరుణంలో భార్య, సోదరితో కలసి తీర్థయాత్రలు చేశారు. హరిద్వార్‌లో పరిచయమైన స్వామి భోలానందగిరి సాంగత్యంలో పోయిన మనశ్శాంతి మళ్లీ చేకూరింది. జతీన్‌ నేపథ్యం తెలిసిన ఆ స్వామి మళ్లీ ఉద్యమం ఆరంభించమని, తన సాయం ఉంటుందని ఆశీర్వదిచారు. తిరిగి స్వగ్రామానికి వచ్చిన తరువాత మానవ రక్తం రుచి మరిగిన ఒక చిరుత తిరుగుతోందని తెలిసింది. దీనిని పట్టుకునే క్రమంలో జతీన్‌ బంధువుల తుపాకీ కాల్చాడు. కానీ గురి తప్పింది.

కానీ జతీన్‌ చిరుతతో బాహాబాహీ తలపడ్డారు. ఒళ్లంతా గోళ్లు దిగి జతీన్‌ శరీరం విషపూరితమైంది. అయినా తన వద్ద ఉన్న గూర్ఖాలు వాడే ఖుక్రీ కత్తితో పొడిచి చంపారు. దీనికి ప్రభుత్వం జ్ఞాపిక ఇచ్చి, ‘బఘా (పెద్దపులి) జతీన్‌’ అని పేర్కొంది. అప్పటి నుంచి ఆయన పేరు బఘా జతీన్‌గా మారింది (ఆ ఖుక్రీ ఇప్పటికీ ఆయన కుటుంబీకుల దగ్గర భద్రంగా ఉంది. పండుగలలో దేవతా విగ్రహాలతో పాటు దానిని కూడా పూజిస్తున్నారు. జతీన్‌ మరణ వార్త విన్న కుటుంబం మిగిలిన సామానుతో పాటు ఆ ఖుక్రీని కూడా వెంట తీసుకుని అప్పుడు తమ ఇల్లు విడిచి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయింది).

‘మనం మరణిద్దాం! జాతి మేల్కొంటుంది’ అన్న నినాదంతో జతీన్‌ ఉద్యమాన్ని ఆరంభించారు. జాతీయ కాంగ్రెస్‌ స్వరాజ్యం అన్నమాట పలకడానికి సిద్ధంగా లేని రోజులలోనే ఆయన సంపూర్ణ స్వరాజ్యం గురించి ఆలోచించారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. బ్రిటన్‌ పరిపాలనను కూల్చడానికి ఈ యుద్ధ పరిస్థితులను ఉపయోగించుకోవాలని భారతదేశంలోని తీవ్ర జాతీయవాదులంతా ఆలోచించారు. అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూక్తిని అనుసరించి జర్మనీతో మంతనాలు ఆరంభించారు. ఆ క్రమంలోనే జతీన్‌కు ఒక అవకాశం కాళ్ల వరకు వచ్చింది. జర్మనీ యువరాజు 1912లో కలకత్తా వచ్చారు. జతీన్‌ ఎలాగో ఆయనను కలుసుకోగలిగాడు.

భారతదేశం నుంచి ఇంగ్లండ్‌ జాతిని తరిమికొట్టేందుకు, సామ్యవాద దేశంగా ఏర్పాటు చేయడానికి సహకరించాలని; ఇందుకు సాయుధ పోరాటానికి ఆయుధాలు ఇప్పించాలని కోరారు. ఆయుధాలు పంపించడానికి ఆయన దగ్గర ప్రమాణం కూడా తీసుకున్నారు.  అప్పటికే ఇక్కడ ఆయుధ సేకరణకు, ఇతర కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని సేకరించే బాధ్యత జతీన్‌ ఎంఎన్‌ రాయ్‌కి అప్పగించారు.  జర్మనీ నుంచి ఆయుధాలతో వచ్చే నౌకను ఒడిశాలోని బాలసోర్‌ జిల్లా తీరంలో ఆపాలని నిర్ణయించారు. ఈ నౌక కోసం జతీన్‌ ఆయన సహచరులు ఎంతో ముందే కప్తిపడా అనే గ్రామం చేరుకుని రహస్యంగా జీవించారు. కానీ నౌక రాలేదు (ఈ ఉదంతం కూడా ఇండో జర్మన్‌ కుట్రకేసులో భాగం).
జర్మనీ నుంచి ఆయుధాలు పంపాలన్న ఆలోచనలో, ఆ నౌక తూర్పు తీరంలో బాలసోర్‌ జిల్లా తీరంలో ఆగాలన్న నిర్ణయంలో లోపం లేదు. కానీ ఈ పథకం గురించి ఇ.వి. వోస్కా అనే చెక్‌ గూఢచారికి తెలిసిపోయింది. అతడు ఈ రహస్యాన్ని బ్రిటిష్‌ అధికారులకు అమ్ముకున్నాడు. ఈ బాలసోర్‌ పంపడానికి ఆయుధాలు అమ్మిన వ్యాపారి కూడా ఇలాగే వ్యవహరించాడు. నిజానికి ఆయుధాలతో జర్మనీ నుంచి నౌక బయలుదేరిన సంగతి కూడా జతీన్‌కు తెలిసింది.

దీనితో జతీన్‌ బృందం కొండల మార్గంలో రెండురోజుల పాటు నడిచి మయూర్‌భంజ్‌ చేరుకుంది. బాలసోర్‌ దగ్గరే చషాఖండ్‌ అనే గ్రామంలో ఒక చిన్న కొండ ఎక్కి నౌక కోసం చూస్తున్నారు. అప్పుడే బలగాలు చుట్టుముట్టాయి. కలకత్తా, బాలసోర్‌లలో ఉండే పోలీసులు, భద్రక్‌ దగ్గరి చాంద్‌బలి నుంచి ఒక ఆర్మీ బృందం అందులో ఉన్నాయి. విప్లవకారుల దగ్గర మాసెర్‌ రివాల్వర్లు తప్ప పెద్ద ఆయుధాలు ఏమీ లేవు. కానీ బ్రిటిష్‌ బలగాలు శక్తిమంతమైన ఆయుధాలతో వచ్చాయి. రెండు గంటలే యుద్ధం జరిగింది. జతీన్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరునాడే బాలసోర్‌ ఆస్పత్రిలో చనిపోయారు. కొద్దిమందే అయినా జతీన్‌ బృందం కూడా వీరోచితంగా పోరాడి కొందరు బ్రిటిష్‌ సిబ్బందిని మట్టుపెట్టగలిగింది.

జతీన్‌ వంటి గొప్ప యోధుడు, చింతనాపరుని గురించి కూడా సరైన సమాచారం చరిత్ర పుస్తకాలలో దొరకకపోవచ్చు. కానీ నాటి కథనాలు, అందులో జతీన్‌ గురించి వ్యక్తమైన అభిప్రాయాలు గమనిస్తే ఆయన ఎంతటి సమున్నతుడో తెలుస్తుంది. మింటో, హార్డింజ్‌ అనే ఇద్దరు గవర్నర్‌ జనరళ్లు కూడా ఆయన కార్యకలాపాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చార్లెస్‌ అగస్టస్‌ టెగ్రాట్‌ నాటి ప్రముఖ పోలీసు అధికారి. ఇతడు, ఇంగ్లండ్‌లో కనుక పుట్టి ఉంటే, ట్రెఫాల్గర్‌ కూడలిలో అతడి విగ్రహాన్ని నెల్సన్‌ విగ్రహం పక్కన నెలకొల్పేవారు అని వ్యాఖ్యానించాడు.

జతీన్‌ ఉత్తర, తూర్పు భారతాలలో విప్లవ కార్యకలాపాల కోసం పునాదులు వేసుకుంటూ, ఆగ్నేయాసియా, అమెరికా, ఐరోపాలలో భారతీయులు జరుపుతున్న బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలను సమన్వయం చేయడానికి కృషి చేశారు. జర్మనీ నుంచి సాయం అందిన తరువాత దేశమంతటా ఒకేసారి తిరుగుబాటు చేయాలని స్నేహితుడు రాస్‌ బిహారీ బోస్‌తో కలసి ఆయన ఆలోచించాడు. ఈ తరం త్యాగాలు చేస్తేనే భవిష్యత్తరాలు తలెత్తుకు బతకగలవన్న సిద్ధాంతంతోనే జతీన్‌ ముందుకు న డిచారని ఆయన మనుమడు, జీవిత కథ రచయిత పృథ్విన్‌ ముఖర్జీ రాశారు. జతీన్‌ బాహాబాహా తలపడి ఒక క్రూరమృగాన్ని చంపారు. మనిషి రూపంలో ఉన్న ఈ బెంగాల్‌ టైగర్‌ను చుట్టుముట్టి చంపవలసి వచ్చింది. 
- డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top