ఉదయ శ్రీ కోసం..
ఆదివారం సాయంత్రం.. కూకట్పల్లి మంజీర మాల్.. ఎవరి షాపింగ్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో రాక్ బ్యాండ్ రేంజ్లో మ్యూజిక్
స్టార్టయింది. అప్పటి వరకూ.. ఎవరికెవరూ సంబంధం లేదన్నట్టున్న యువతీ యువకులంతా ఒకే చోటికి చేరుకున్నారు. మ్యూజిక్కు తగ్గట్టుగా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. ఈ తంతు చూసి పుర్రెకో బుద్ధి అని అనుకున్న వారంతా.. వాళ్లు వేస్తున్న చిందుల వెనుక అసలు కారణం తెలుసుకుని కరతాళ ధ్వనులతో సపోర్ట్ గా నిలిచారు.
- శిరీష చల్లపల్లి
ఉదయ శ్రీ కోసం..
ప్లాష్ మాబ్.. సిటీకి కొన్నేళ్ల కిందట పరిచయమైంది. షాపింగ్ మాల్స్, మల్లీప్లెక్స్లు, క్రాస్రోడ్స్లో.. ఉన్నట్టుండి ఓ బృందం ఊడిపడుతుంది. ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది. అదిరిపోయే ఆటపాటలతో టెంపరేచర్ హీట్ చేస్తుంది. ఒకప్పుడు
సరదాగా కాసేపు నిర్వహించే ఈ ఈవెంట్కు సోషల్ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తోంది సిటీ యూత్. అలాంటి థీమ్తో పుట్టిందే
ఆస్యా ఫౌండేషన్.
సోషల్ పబ్లిసిటీ..
ఈ ఫౌండేషన్ సూత్రధారి శ్రీరామ్.. శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి. ఏడాది కిందట అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అనారోగ్యం పాలైంది. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న ఆ కుటుంబం దేవుడిదే భారం అనుకుంది. ఇది తెలిసిన శ్రీరామ్.. ఆస్యా ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియా ద్వారా తన స్నేహితులకు, తెలిసిన వారికి విషయాన్ని చేరవేశాడు. అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ప్లాష్ మాబ్ నిర్వహించాడు. వీరి ఆటపాటలు.. అంతకన్నా దాని వెనుకున్న అసలు నిజం తెలిసిన ఎందరో తోచిన సాయం చేశారు. ఆ మొత్తాన్ని ఆ అమ్మాయికి అందజేశాడు. ఏడాదిగా 23 ఈవెంట్లు నిర్వహించిన ఆస్యా ఫౌండేషన్ ఆరుగురి ప్రాణాలకు అండగా నిలిచింది.
ఇన్వెస్ట్ ఎబిలిటీ..
18 నెలల పాప నిండు ప్రాణాన్ని కాపాడేందుకు తమ ఎబిలిటీని నమ్ముకుని మంజీర మాల్లో డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించింది శ్రీరామ్ అండ్ కో. మెదక్ జిల్లాకు చెందిన ఉదయశ్రీ కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతోంది. ఆ చిన్నారి తండ్రి సాయిలు చిరుద్యోగి. పాప వైద్యానికి రూ.ఏడు లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పారు. తల తాకట్టు పెట్టి రెండు లక్షలు వరకూ ఖర్చు చేసి వైద్యం చేయించాడు. మరో ఐదు లక్షలు కావాలి.. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇదే సమయంలో ఆ చిన్నారి పరిస్థితి తెలిసిన శ్రీరామ్.. ఫ్లాష్మాబ్కు సిద్ధమయ్యాడు.
సోషల్ మీడియా ప్రచారంతో.. పలు ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులతో పాటు ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కూడా ఈ గ్రూప్నకు వెన్నుదన్నుగా పదం కదిపారు. హీరో నందు, భాయ్, పూలరంగడు డెరైక్టర్ వీరభద్రం కూడా దీనికి హాజరై సపోర్ట్గా నిలిచారు. ఈ ఈవెంట్కు ఒక యాక్టర్గా కాకుండా మనసున్న మనిషిగా హాజరయ్యానన్నాడు హీరో నందు. ఆ పాపకు హెల్ప్ చేయాల్సిందిగా తనూ ప్రచారం చేస్తానని చెప్పాడు. ఉదయ శ్రీ తండ్రికి కొంత మొత్తాన్ని కూడా అందజేశాడు.
సోషల్ రెస్పాన్సిబిలిటీ..
కొన్ని రోజుల కిందట బీవీఆర్ఐటీ విద్యార్థులతో సైకిల్ రైడింగ్ కూడా నిర్వహించి రూ.35 వేలు సేకరించి.. ఉదయ శ్రీ తండ్రికి అందజేసింది ఆస్యా ఫౌండేషన్. మళ్లీ వైద్యానికి డబ్బులు అవసరం అవడంతో.. ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ‘మా టీమ్లో 15 మంది ఉన్నాం.. కల్చరల్ డ్యాన్స్తో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేశాం. ఓ మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు సంతోషంగా ఉంద’ని బీవీఆర్ ఐటీ విద్యార్థిని జాహ్నవి తెలిపింది. ఆస్యా ఫౌండేషన్ కేవలం సిటీకే పరిమితం కాలేదు. పల్లెలు, తండాలకు వెళ్తోంది. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. ఉచిత వైద్య శిబిరాలనూ నిర్వహిస్తోంది. సమాజహితమే మార్గంగా ఎంచుకున్న ఆస్యా ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుందాం.