ఒప్పుకునేవాడే మహాత్ముడు..

Special Story On Mahatma Gandhi 150th Birth Anniversary - Sakshi

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా..

ఎరవాడ సెంట్రల్‌ జైలు (మహారాష్ట్ర)లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీకి తన ఆత్మకథ రాయడానికి తగినంత సమయం చిక్కింది. ‘నవజీవన్‌ పత్రికకు ఏదో కొంత వ్రాయక తప్పడం లేదు. అట్టి స్థితిలో ఆత్మకథనే వ్రాయవచ్చు కదా’ అనుకున్నారు. అప్పటికి ఒకరిద్దరు మిత్రులు రాయమని పోరుతూవున్నారు. అయితే, ఆత్మకథలు రాయడం పాశ్చాత్య విధానం. ప్రాచ్య దేశాల్లో ఎవరూ పెద్దగా రాసినట్టు లేదు.

‘ఈనాడు మీరు అంగీకరిస్తున్న సిద్ధాంతాన్ని రేపు అంగీకరించకపోవచ్చు కదా! ఇవాళ మీరు చేస్తున్న పనుల్లో రేపు మార్పు చేయాల్సి వస్తే? మీ రచనను ప్రామాణికమని భావించి కొందరు తమ ఆచరణను రూపొందించుకుంటారు గదా! వాళ్లు తప్పుదోవన పడితే?’ ఇలాంటి ప్రశ్నలు వేశాడు ఒక మంచి మనసున్న అనుచరుడు. గాంధీజీ దీనిమీద బాగానే యోచించారు.

అందుకే ఆయన ఆత్మచరిత్ర రాయాలని అనుకోలేదు. ఆయన అనేక సమయాల్లో సత్యప్రయోగాలు చేశారు. తాను చేసిన సత్యప్రయోగాలను ప్రజల ముందుంచితే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నమ్మారు. ‘ఒకరికి శక్యమైంది అందరికీ శక్యం కాగలద’ని విశ్వసించారు. నిజమైన ఆధ్యాత్మికతలో గర్వానికి తావులేదు. అయితే, పరమ సత్యం ఆయనకు గోచరించిందా? ‘సత్య సాక్షాత్కారం కలుగనంత వరకు నా అంతరాత్మ దేన్ని సత్యమని నమ్ముతుందో ఆ కాల్పనిక సత్యం’ ఆధారంగా జీవితాన్ని గడుపుతానన్నారు.

‘మో సమ్‌ కౌన్‌ కుటిల్‌ ఖల్‌ కామీ?/ జిన్‌ తన్‌ దియో తాహి బిసరాయో ఐసో నమక్‌ హరామీ(సూరదాసు)’. నా వంటి కుటిలుడు, ఖలుడు, కాముకుడు మరొకడెవ్వడు గలడు? ఏ ప్రభువు ఈ తనువును ఇచ్చాడో అతనినే మరిచాను, నేను అంతటి కృతఘ్నుణ్ణి. ఒక మనిషి ఎంత మేరకు స్వచ్ఛపడగలడు? ఎంత మేరకు సత్యపాలన చేయగలడు? నాయందలి వికారాలను చూడగలుగుతున్నానేగానీ వాటిని పూర్తిగా తొలగించుకోలేకపోతున్నాననే అన్నారు గాంధీజీ. దానికదే సత్యవాక్కు.

గాంధీజీ తన ఆత్మకథను గుజరాతీ భాషలో రాశారు. రచనాకాలం 1925–29. దీన్ని ఆయన కార్యదర్శి మహదేవ్‌ దేశాయ్‌ 1940లో ‘యాన్‌ ఆటోబయోగ్రఫీ: ద స్టోరీ ఆఫ్‌ మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’గా ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఇరవయ్యో శతాబ్దపు నూరు అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటిగా ఇది కీర్తించబడింది. ఎన్నో భాషల్లోకి, దేశాల్లోకి విస్తరించింది. ‘ఆత్మకథ లేదా సత్యశోధన’ పేరుతో దీన్ని తెలుగులోకి వేమూరి రాధాకృష్ణమూర్తి అనువదించారు.

గాంధీజీ నూటాయాభయ్యో జయంతి ఉత్సవాల సందర్భంగా అందులోని ‘దొంగతనం – ప్రాయశ్చితం’ అనే ఒక ఘట్టం ఇక్కడ. అహింస ఎంతటి శక్తిమంతమైనదో అర్థం చేయించిన సందర్భంగా గాంధీజీ దీన్ని చెప్పుకున్నారు. అలాగే గాంధీజీ అందరిలాగే తప్పులు చేశాడనీ, కానీ వాటిని దిద్దుకోవడం ద్వారానే ఆయన మహాత్ముడయ్యాడనీ అర్థం చేసుకోవడానికి అవకాశమిచ్చే సందర్భం కూడా.

నా ఒక బంధువు సావాసంలో పడి సిగరెట్టు తాగాలని నాకు సరదా కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. సిగరెట్టు త్రాగితే కలిగే ప్రయోజనం ఏమిటో, దాని వాసనలో గల మజా ఏమిటో మా ఇద్దరిలో ఎవ్వరికీ తెలియదు. కాని పొగూదుతూ వుంటే మజాగా వుండేది. మా పినతండ్రికి ఆ అలవాటు ఉన్నది. ఆయన, మరో కొంతమంది పొగపీల్చి సుతారంగా బయటికి వదులుతూ ఉండటం చూచి మాకు కూడా ఒక దమ్ము లాగుదామనే కోరిక కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల మా పినతండ్రి కాల్చిపారేసిన సిగరెట్టు ముక్కలు ఏరి కాల్చడం ప్రారంభించాము.

అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కావు. దొరికినా ఎక్కువ పొగ వచ్చేది కాదు. అందువల్ల నౌకర్ల డబ్బులు దొంగిలించి బీడీలు కొనడం ప్రారంభించాము. అయితే వాటిని ఎక్కడ దాచడమా అను సమస్య వచ్చింది. పెద్దవాళ్ల ముందు ఎలా కాల్చడం? అందువల్ల దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్లు కొని రహస్యంగా త్రాగడం ప్రారంభించాం. కొన్ని మొక్కల కాడలకు సన్నని బెజ్జాలు ఉంటాయనీ, వాటిని సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చనీ విన్నాము. దీనితో మాకు తృప్తి కలుగలేదు. మా పారతంత్య్రాన్ని గురించి యోచించి చాలా దుఃఖించాము.

పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించాము. చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నాము. అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవడం? విషం ఎలా దొరుకుతుంది? ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నాము. వాటి కోసం వెతుక్కుంటూ అడవికి వెళ్లి తెచ్చాము. సాయంకాలం తినాలని నిర్ణయించుకున్నాం. కేదారేశ్వరుని దేవాలయానికి వెళ్లి, దీపం ప్రమిదలో నెయ్యి పోశాం. దైవదర్శనం చేసుకున్నాం. మారుమూల ఉన్న చోటుకోసం వెతికాం. అయితే వెంటనే ప్రాణం పోకపోతే? చస్తే ఏమి లాభం? ఏమి సాధించినట్లు? స్వాతంత్య్రం లేకుండా బ్రతకకూడదా? ఈ రకమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కి పోయింది.

ధైర్యం తగ్గిపోసాగింది. అప్పటికి రెండు మూడు ఉమ్మెత్త గింజలు మ్రింగివేశాము. తరువాత సాహసించలేకపోయాము. మా ఇద్దరికీ చావంటే భయం వేసింది. కుదుటపడేందుకు, ప్రాణాలు నిలుపుకునేందుకు రామమందిరం వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆత్మహత్య ఎవరైనా చేసుకోవడం తేలిక వ్యవహారం కాదని అప్పుడు నాకు బోధపడింది. అప్పటినుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని అంటే నాకు వాళ్ల మాటమీద విశ్వాసం కలుగకుండా పోయింది.

ఈ ఆత్మహత్య సంకల్పం మాకు మరోవిధంగా తోడ్పడింది. సిగరెట్ల పీకలకు సలాం చేసేందుకు, సిగరెట్ల కోసం నౌకర్ల డబ్బులు దొంగిలించకుండా ఉండేందుకు ఎంతగానో సహకరించింది. పెరిగి పెద్దవాడినైన తర్వాత సిగరెట్లు తాగాలనే వాంఛ ఎన్నడూ కలుగలేదు. అది చాలా అనాగరికం, హానికరం, రోత వ్యవహారం అను నిశ్చయానికి వచ్చాను.

ప్రపంచంలో సిగరెట్ల కోసం ఇంత మోజెందుకో నాకు అర్థం కాదు. పొగ త్రాగేవాళ్లతో రైలు ప్రయాణం నేను చేయలేను. నాకు ఊపిరాడదు.
అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయసులో (అంతకంటే తక్కువ ఉండవచ్చు) మొదట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుంచి కొంచెం దొంగిలించాము. మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం. ఆ పని చేశాం.

అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.

చివరికి ఒక చీటీమీద చేసిన తప్పంతా రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్లి మా తండ్రిగారికి ఇచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమనీ, ఇకముందు దొంగతనం చేయననీ శపథం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. మా తండ్రి భగందర రోగంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారు. ఆయన బల్లమీద పడుకుని ఉన్నారు. చీటీ వారి చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను.

వారు చీటీ అంతా చదివారు. వారి కండ్లనుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషం సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడా ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజు కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.

‘రామబాన్‌ వాగ్యాంరే హొయ్‌ తే జేణే’. రామబాణం మహిమ ఆ బాణం తగిలినవాడికే తెలుస్తుంది అని దాని అర్థం. ఆ ఘట్టం నాకు మొదటి అహింసా పాఠం అయింది. పితృవాత్సల్యం అంటే ఏమిటో అప్పుడు నాకు బోధపడలేదు. కాని ఈనాడు ఆలోచిస్తే అదంతా అహింస మహిమేనని అనిపిస్తుంది. అట్టి అహింస అంతటా వ్యాప్తమైనప్పుడు దాని స్పర్శ తగలకుండా ఉండదు. అహింసా శక్తి అమోఘం.

అంతటి శాంతం ఓర్పు వాస్తవానికి మా తండ్రి స్వభావానికి విరుద్ధం. ఆయన కోప్పడతారనీ, దూషిస్తారనీ లేక తల బ్రద్దలు కొట్టుకుంటారనీ భావించాను. కాని ఆయన ప్రదర్శించిన శాంతితత్వం అద్భుతం. అందుకు కారణం దోషాన్ని అంగీకరించడమేనని నా విశ్వాసం. మళ్లీ ఈ విధమైన దోషం చేయను అని శపథం చేశాను. దాని అర్థం గ్రహించగలవారి ముందు ఉంచాను. అదే సరిౖయెన ప్రాయశ్చిత్తమని నా అభిప్రాయం. నేను దోషం అంగీకరించి ఇక చేయనని శపథం చేసినందువల్ల మా తండ్రి నన్ను విశ్వసించారు. వారికి నా మీద వాత్సల్యం ఇనుమడించిందని నాకు బోధపడింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top