గోండు దేవత

special  on koko temple - Sakshi

దండారి ఉత్సవాలకు వేదిక...పద్మల్‌పురి కాకో దేవాలయం

గల గల పారే గోదావరి నది ఒడ్డున నెమలిచెట్టు కింద వెలసింది పద్మల్‌ పూరి కాకో. ఆమె ఆదివాసీగోండు ప్రజల ఆరాధ్య దైవం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక గోండుల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆదివాసీ గోండులు  పద్మల్‌పూరి కాకోను తమ ఆరాధ్యదైవంగా పూజిస్తారు. ప్రతి ఏటా దసరా తర్వాత ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజునుంచి దీపావళి వరకు ఇక్కడ దండారీ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామ సమీపంలో జరిగే ఈ వేడుకలకు తెలంగాణాలోని పలు జిల్లాలతో పాటు, మహారాష్ట్ర నుంచి కూడా ఆదివాసీ గోండు గిరిజనులు కుటుంబ సమేతంగా ప్రతి యేటా క్రమం తప్పకుండా వస్తుంటారు.

ఆలయ ప్రాశస్త్యం...
గోండ్వాన భౌగోళిక పౌరాణిక చరిత్ర ప్రకారం ఐపోక్‌ గుట్టకోర సమ భాగంలో అదిల్‌కోట్‌ ఘణరాజ్యం.. యాద్మల్‌పురికోట భూపత్‌కుర్వదీప్‌(పద్మల్‌పురికోట) కల్లిపుట్‌ అక్కో పద్మల్‌పురికాకో వారి ఘనరాజ్యం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్నట్లుగా భూగోళశాస్త్ర పరిశోధకులు చెప్పినట్లుగా హైమన్‌డార్ఫ్‌ రాసిన ‘ది రాజ్‌గోండ్స్‌ ఆఫ్‌ ఆదిలాబాద్, మిత్స్‌ అండ్‌ రిట్యువల్స్‌ అనే గ్రంథంలో పద్మల్‌పూరి కాకో ఆలయం గురించిన ఆధారాలు ఉన్నట్లు పలువురు గోండు పరిశోధకులు చెబుతున్నారు. పద్మల్‌పురి కాకో అంబుబాయి రాజ్యం పురాతన తెలుగునాటి పౌరాణిక రాజ్యం గుడిరేవు గోదావరి తీరంలోని అదిల్‌కోటను ఏలుతుండేది.. ఈ కాలంలో అదిల్‌కోట గోండు గిరిజనులకు పుట్టినిల్లుగా ఉండేది.. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన పద్మల్‌పురి కాకో (అమ్మమ్మ) దేవతను గోండు గిరిజనుల్లో పుట్టిన ప్రతి ఒక్కరు తప్పక దర్శించాలని నమ్మకం. కాకోను దర్శించుకుంటే జన్మ సార్థకమవుతుందనే విశ్వాసంతో ఈ ఆచారాన్ని గోండులు తప్పక పాటిస్తుంటారు.

ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలు...
పద్మల్‌పురి కాకో ఆలయంలో యేటా దసరా పండుగ తర్వాత వచ్చే ఆశ్వీయుజ పౌర్ణమి రోజు నుంచి దీపావళి వరకు ఇక్కడ దండారి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆదివాసీ గోండు గిరిజనులు కుటుంబ సమేతంగా వచ్చి పద్మల్‌పురి కాకోను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. నియమ నిష్ఠలతో తయారు చేసిన గారెలు, పాయసం, బూరెలను కాకోకు నైవేద్యంగా సమర్పిస్తారు. మేకలు, కోళ్లు బలిస్తారు.

ప్రత్యేక ఆకర్షణగా గుస్సాడీ వేషాలు...
కాకో ఆలయంలో ఏటా నిర్వహించే దండారి వేడుకల్లో గుస్సాడీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నెమలి ఈకలతో తయారు చేసిన టోపి, చంకన జింక తోలు ధరించి, కళ్లకు అద్దాలు, చేతిలో కోలా పట్టుకుని డప్పు వాయిద్యాలకు గుస్సాడీలు చేసే నృత్యాలు, గోండు మహిళల దండారి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. దండారి వేడుకలను తిలకించేందుకు స్థానికులు (అక్కడ నివసిందే గోండేతరులు) కూడా వస్తుంటారు.

గోదారమ్మతో ప్రత్యేక అనుబంధం...
ఆదివాసీ గోండులకు గోదారమ్మకు ప్రత్యేక అనుబంధం ఉంది. కాకో దర్శనానికి వచ్చిన గోండులు ముందుగా గోదారమ్మకు శాంతి పూజలు నిర్వహించిన తర్వాతే కాకో ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో గోదారమ్మను ఆదివాసీల గోదారమ్మగా కూడా పిలుచుకుంటారు. గోండుల సంస్కృతి సంప్రదాయాలపై పరిశోధనలు చేయదలచుకున్నా, వారి ఆచార వ్యవహారాలను దగ్గరగా పరిశీలించాలనుకున్నా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.

ఇలా వెళ్లచ్చు...
కాకో ఆలయానికి వెళ్లాలంటే.. హైదరబాద్, కరీంనగర్, వరంగల్‌ నుంచి వచ్చే వారు... వయా లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, ఊట్నూర్‌కు వెళ్లే బస్సు ఎక్కి.. మేదరిపేట స్జేజీ వద్ద దిగాలి. అక్కడనుంచి ఆటోలో ఆలయం వరకు వెళ్లవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్‌ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వెళ్లే బస్సులు ఎక్కాలి. మేదరిపేటలో దిగి ఆటోల ద్వారా వెళ్ళచ్చు. మంచిర్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు నిర్మల్, ఆదిలాబాద్, ఊట్నూర్‌ వెళ్లె బస్సులు ఎక్కి మేదరిపేటలో దిగి ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే వాళ్లు మంచిర్యాలలో దిగి అక్కడనుంచి బస్సులో చేరవచ్చు.
– మొదంపురం వెంకటేష్‌
దండేపల్లి, మంచిర్యాల జిల్లా, సాక్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top