మధుమేహం మందులతో జాగ్రత్త అంటున్న శాస్త్రవేత్తలు...
మెట్ఫార్మిన్... మధుమేహ చికిత్స కోసం భారత్లో ఎక్కువమంది వాడే మందు ఇది. అయితే ఈ మందు సమర్థత, భద్రతపై సందేహాలు ఉన్న నేపథ్యంలో దేశంలోని నియంత్రణ సంస్థలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు మసాచుసెట్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ఆధారంగా తాము మెట్ఫార్మిన్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్పై అధ్యయనం జరిపామని వెలరీ ఇవాన్స్ అనే శాస్త్రవేత్త చెప్పారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులను ఒకే ట్యాబ్లెట్, క్యాప్సూల్ ద్వారా అందించడాన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అంటారని, మధుమేహానికి ఇలాంటి మందులు వాడవచ్చునని ఏ జాతీయ, అంతర్జాతీయ మార్గదర్శకాలు చెప్పడం లేదని ఇవాన్స్ స్పష్టం చేశారు.
మధుమేహుల్లో రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలోకి రావడం ఒకొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఈ మందులతో ఎంతమేరకు ఉపయోగమన్నది ఇప్పటివరకూ స్పష్టం కాలేదని చెప్పారు. భారత్లోని ఫార్మా కంపెనీలు ఈ ఎఫ్డీసీలను ప్రపంచమంతా ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో వీటిపై తగినన్ని పరీక్షలు జరగాలని సూచించారు. రెండేళ్ల క్రితం భారత ప్రభుత్వం ఇలాంటి 344 మందులపై నిషేధం విషయాన్ని గుర్తుచేశారు. వీటిల్లో మూడు ఎఫ్డీసీ మెట్ఫార్మిన్ రకాలూ ఉన్నాయని.. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేస్తే ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉందని.. ఆరు నెలల్లోపు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సినందున తాము ఈ అధ్యయనం చేశామని వివరించారు.