తలపాగా ధరిస్తే ఎవరి మాటా వినను!
సాహిత్య మరమరాలు
ముట్నూరి కృష్ణారావు ఎప్పుడూ తెల్లని ఖద్దరు తలపాగా ధరించేవారు. అందువల్లనే ఆయనకు ‘ఖద్దరు కిరీటధారి’ అనే పేరు సార్థకమైంది. ఒకసారి కృష్ణారావు తన ఆప్తమిత్రుడైన భోగరాజు పట్టాభిరామయ్యను తన కృష్ణాపత్రికలో నిశితంగా విమర్శించారు. అది చూసి వారిద్దరికీ మిత్రుడైన ఒక ప్రముఖుడు కృష్ణారావు దగ్గరికి పోయి, ‘‘మీ విమర్శకు పట్టాభి గారు ఎంతో నొచ్చుకుంటున్నారు. ఒక ప్రాణస్నేహితుణ్ని యింత తీవ్రంగా విమర్శించడం భావ్యం కాదేమో’’ అని అడిగాడు.
అందుకు ముట్నూరి తన తలపాగా తీసి పక్కన పెట్టి, ‘‘ఇడుగో, ఇతడు పట్టాభి మిత్రుడు కృష్ణారావు. ఇతడు పట్టాభిపై ఈగనైనా వాలనీయడు’’ అని చెప్పి, తలపాగాను తిరిగి పెట్టుకుంటూ ‘‘ఇడుగో ఇతడు ఎడిటర్ కృష్ణారావు. ఇతడికి మిత్రులు లేరు, శత్రువులూ లేరు. తన ప్రాణమిత్రుడైన పట్టాభి తప్పు చేసినా ఇతడు సహించలేడు’’ అని చెప్పాడు. వచ్చిన వ్యక్తి అవాక్కయ్యాడు.
-అయినాల కనకరత్నాచారి
సంబంధిత వార్తలు