వాళ్లకింకా భూమి బల్లపరుపుగానే ఉంది
పరిపరిశోధన
భూమి గోళాకారంలో ఉందని చిన్నప్పటి నుంచి అంతా చదువుకుంటూనే ఉన్నాం. అందుకు నిదర్శనంగా వివిధ పరిశోధన సంస్థలు అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలను కూడా చూస్తూనే ఉన్నాం. పురాణకాలాల్లోని నమ్మకాలు ఎలా ఉన్నా, భూమి ఎలా ఉంటుందని ఇప్పుడు చిన్న పిల్లలను అడిగినా గోళాకారంలో ఉంటుందనే చెబుతారు. అలాంటిది ఈ ఆధునిక ప్రపంచంలోనే కొందరు మహానుభావులు ఇంకా భూమి బల్లపరుపుగా ఉందని గట్టిగా నమ్ముతున్నారు. ఇలాంటి వాళ్లకు ‘ఫ్లాట్ ఎర్త్ సొసైటీ’ పేరిట ఒక సంఘం కూడా ఉంది. ఇంతవరకూ ఆ సంస్థ కార్యక్రమాలు ఎవరికీ తెలియవు. నిజానికి ఆ సంస్థ సభ్యులు కూడా పెద్దగా ఎలాంటి కార్యక్రమాలనూ ఇంతవరకు నిర్వహించనేలేదు.
అయితే, భూమి బల్లపరుపుగా ఉందని ప్రగాఢంగా విశ్వసించే ఈ సంస్థ ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినాలో తొలి వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 400 మంది సభ్యులు పాల్గొన్నారు. భూమి ఆకారంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ చేస్తున్న ప్రచారమంతా శుద్ధ అబద్ధమని, భూమి బల్లపరుపుగా ఉందన్న ‘అసలు నిజాన్ని’ ఎప్పటికైనా ప్రజలకు వెల్లడి చేయాలని ఈ సమావేశంలో గట్టిగా తీర్మానించుకున్నారు.
సంబంధిత వార్తలు