గ్రేట్ రైటర్ గుస్తావ్ ఫ్లాబేర్
జీవితంలోని అతి చిన్న, ఎలాంటి ప్రాధాన్యతా లేని సాధారణ ఘటనలను సాహిత్యంలో చిత్రించడానికి పూనుకున్న ‘లిటెరరీ రియలిజం’ ఉద్యమంలో గుస్తావ్ ఫ్లాబేర్ ఒక కీలక రచయిత. జననం ఫ్రాన్సులో. జీవితకాలం 1821–1880. ఎనిమిదేళ్లకే రాయడం ప్రారంభించాడని చెబుతారు. ‘మదామ్ బావరీ’ నవల ఆయనకు విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. భావానికి తగిన పదాన్ని ఎంచుకోవడం కోసం ఫ్లాబేర్ చాలా శ్రమపడతాడు. అందుకే తన జీవితకాలంలో ఎక్కువ రచనలు చేయలేకపోయాడు.
మెమొయిర్స్ ఆఫ్ మేడ్మాన్, సెంటిమెంటల్ ఎజుకేషన్, ద టెంప్టేషన్ ఆఫ్ సెయింట్ ఆంథోనీ మొదలైనవి ఆయన ఇతర రచనలు. స్వరసామ్యము కన్నా వాక్యాల మధ్య మేళనము సరిగ్గా కుదర్చడానికి ప్రాధాన్యతనిస్తానని చెప్పుకున్నాడు. ఇరవయ్యో శతాబ్దపు రచయితలు, తాత్వికులకు ఎందరికో ప్రేరణగా నిలిచాడు. విఖ్యాత కథకుడు మపాసాకు ఫ్లాబేర్ గురుసమానుడు. ప్రాణిగా బతకడంలో భరించాల్సిన అవమానాన్ని మరొకరికి బదలాయించడం ఇష్టం లేక పిల్లలకు జన్మనివ్వకూడదనుకున్నాడు. అందుకే పెళ్లి చేసుకోలేదు.