చిన్వా అచేబే
గ్రేట్ రైటర్
జనం సృష్టించిన కథలు జనాన్ని సృష్టిస్తాయి; లేదా, కథలు సృష్టించే జనం కథల్ని సృష్టిస్తారంటాడు చిన్వా అచేబే. నైజీరియాలో జన్మించాడు అచేబే (1930–2013). కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా ప్రపంచానికి ఆఫ్రికా గొంతుగా నిలిచాడు. 19వ శతాబ్దంలో నైజీరియా గడ్డ మీదికి బ్రిటిష్ వాళ్లు వచ్చి, స్థానిక సంస్కృతిని ధ్వంసం చేసి, స్థానికులను వారి జీవితాలకూ భూములకూ పరాయి చేసిన బృహత్తర గాథను 1958లో ఆయన ‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’గా అక్షరబద్ధం చేశాడు.
ఆధునిక ఆఫ్రికా సాహిత్యంలో అత్యధికులు చదివిన, చదువుతున్న నవలగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సహా ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. ఇంగ్లిష్లోనే తన నవలలు రాసిన అచేబేను 2007లో మాన్ బుకర్ పురస్కారం వరించింది. ‘నో లాంగర్ ఎట్ ఈజ్’, ‘యారో ఆఫ్ గాడ్’, ‘ఎ మాన్ ఆఫ్ ద పీపుల్’, ‘ఆంట్హిల్స్ ఆఫ్ ద సవన్నా’ ఆయన ఇతర నవలలు.