చిన్నారికి పాట్లు.. కోడ్కు తూట్లు
ఓటర్లనే కాదు.. తమ అగ్రనేతల కరుణాకటాక్షాల కోసం టీడీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. పనిలో పనిగా ఎన్నికల కోడ్కు తూట్లు పొడుస్తున్నారు. ప్రార్థన మందిరాలను, మత చిహ్నాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని, చిన్న పిల్లలను కూడా ప్రచారంలో ఉపయోగించరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ టీడీపీ నేతలను ఈ రెండు నిబంధనలను ఏకకాలంలో తోసి పారేశారు. అంతేకాకుండా నిండా ఆరేడేళ్లు కూడా లేని చిన్నపిల్లాడిని మండుటెండలో గంటల తరబడి నిలబెట్టి శిక్షించారు. సినీనటుడు బాలకృష్ణ పర్యటన సందర్భంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా మాకివలసలో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. బాలకృష్ణతోపాటు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో టీడీపీ నేతలు ఓ చిన్నపిల్లాడిని గ్రామంలోని శ్రీగుండం పేరంటాలు ఆలయంపైకి ఎక్కించేశారు. పిల్లాడి చేతికి టీడీపీ గుర్తు అయిన సైకిల్, రెండు జెండాలు ఇచ్చి మండుటెండలో నిలబెట్టారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం బాలకృష్ణ మధ్యాహ్నం 2 గంటలకు గ్రామానికి రావలసి ఉండగా భోజనాలు ఆలస్యం కావడంతో 3.30 గంటలకు వచ్చారు. అంతసేపూ.. పాపం.. ఆ చిన్నారి ఎండలో అలానే నిలబడ్డాడు.