బందరులో చిరంజీవికి కోడిగుడ్ల సత్కారం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవికి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోడిగుడ్ల సత్కారం జరిగింది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని 'హిట్లర్' అంటూ తిట్టిపోయడంతో తీవ్రంగా ఆగ్రహించిన బీజేపీ అభిమానులు ఆయన వాహనంపై కోడిగుడ్లు విసిరారు. కోనేరు సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో ఈ సంఘటన జరిగింది. దీంతో చిరంజీవి కాసేపు తన ప్రసంగం ఆపేయాల్సి వచ్చింది. గుడ్లు విసిరే సమయానికి ఆ వాహనంపై ఆయనతో పాటు మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, సి.రామచంద్రయ్య, డీసీసీ అధ్యక్షుడు నరసింహారావు తదితరులు ఉన్నారు. గుడ్లు విసిరినట్లు అనుమానించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నరేంద్రమోడీ నిరంకుశుడని, ఆయన హిట్లర్ లాంటివాడని, వాజ్పేయి, అద్వానీ లాంటి సీనియర్ నాయకులను ఆయన కావాలనే పక్కన పెట్టేస్తున్నారని చిరంజీవి అంతకుముందు తన ప్రసంగంలో అన్నారు. బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలనుకున్న చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని తిట్టిపోశారు.
సంబంధిత వార్తలు