బాబుకు చెంపపెట్టు!

EC Shock To AP CM Chandrababu Naidu - Sakshi

దేశ రాజకీయాల్లో ఇప్పుడు బాహాటంగా గజ్జెకట్టి తాండవమాడుతున్న అనేకానేక దుస్సంప్ర దాయాలకు ఆద్యుడిగా, క్షీణ విలువలకు తిరుగులేని ప్రతీకగా మారిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలొచ్చినప్పుడల్లా ‘ఎలాగైనా’ గెలిచితీరాలన్న ఏకైక ఎజెండాతో ఇష్టా నుసారం ప్రవర్తించడం ఒక అలవాటుగా చేసుకున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఈ విషయంలో ఆయన నైజం ఎప్పుడూ షరా మామూలే. అప్పుడెప్పుడో తొమ్మిదేళ్లపాటు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినట్టే, గత అయిదేళ్లనుంచి అధికార గణంలోని వృత్తి నిబద్ధతకు ఆయన తూట్లు పొడుస్తూ వస్తున్నారు. వినయ విధేయస్వామ్యానికి వీరతాళ్లు వేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాక ఇదంతా తగ్గకపోగా మరింత ముదిరిన వైనం స్పష్టంగా కనబడ్డాక రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ(వైఎస్సార్‌ జిల్లా), వెంకటరత్నం (శ్రీకాకుళం జిల్లా)లపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మంగళవారం వేటు వేసింది. తానేం చేసినా సకల వ్యవస్థలూ చేష్టలుడిగినట్టు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవాలన్నది బాబు కోరిక.

అది నెరవేరకపోయేసరికి ఆయన సర్కారు రకరకాల విన్యాసాలు మొదలెట్టింది. సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఆ ముగ్గురు ఉన్నతాధికారులనూ విధుల నుంచి తప్పిస్తూ రాత్రి జీవో నం. 716 జారీ చేసిన ప్రభుత్వం తెల్లారేసరికల్లా తీరు మార్చుకుంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎన్నికల సంఘం పరిధిలోకి రారంటూ ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత జీవో నం. 716ను రద్దు చేస్తూ కేవలం ఇద్దరు ఎస్‌పీలను మాత్రమే విధులనుంచి తప్పిస్తున్నట్టు జీవో నం. 720ని జారీ చేసింది. మరికొన్ని గంటలకు మరింత అతి తెలివికి పోయి ఎవరెవరు ఎన్నికల సంఘం పరిధిలోకొస్తారో ఏకరువు పెడుతూ జీవో నం. 721 జారీ చేసింది. అందులో డీజీపీ మొదలుకొని పోలీసు కానిస్టేబుల్‌ స్థాయి వరకూ అందరూ ఉన్నారు. ఒక్క ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పోస్టు మాత్రం ఆ చిట్టాలో మాయమైంది! పైగా అది వెనక తేదీ నుంచి... అంటే ఈనెల 18 నుంచి అమల్లోకొస్తుందని పేర్కొన్నారు. మరోపక్క ఇంటె లిజెన్స్‌ చీఫ్‌ బదిలీ చెల్లదని, ఆయన్ను మార్చే హక్కు ఎన్నికల సంఘానికి లేదని చెబతూ హైకో ర్టును ఆశ్రయించింది. దీనిపై చంద్రబాబు సీఈసీకి లేఖ కూడా రాశారు. 

‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అన్న నినాదంతో చంద్రబాబు ఈ ఎన్నికల్లో జనం ముందు కొచ్చారు. అయితే ఆయన అధికారం చేపట్టిననాడే ఈ సంగతిని పోలీసు శాఖకు చెవిలో చెప్పినట్టు న్నారు. కనుకనే రాష్ట్రంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు ప్రయోజనాలు ఈడేర్చడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఆయన మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కొన్నేళ్లుగా ఈ విషయంలో ఆరోపణలు చేస్తూనే ఉంది. అయినా ఉన్నతాధికారుల ధోరణి మారిందేం లేదు. కనుకనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఇతర నాయకులు సీఈసీకి ఆధారాలతోసహా ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్‌లు ట్యాప్‌ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పరికరాలను దుర్వినియోగం చేయడంవంటి పనులకు యధేచ్ఛగా పాల్పడుతున్న విషయాన్ని వారు సీఈసీ దృష్టికి తీసుకొచ్చారు. పోలీసు ఉన్నతా ధికారుల తీరుపై ఇంతకుముందు కూడా అనేక ఆరోపణలొచ్చాయి. విపక్ష ఎమ్మెల్యేలను తెలుగు దేశంలోకి ఫిరాయింపజేయడానికి బేరసారాలాడటం, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని పిలిపించి అక్రమ కేసులు పెడతామని బెదిరించడంవంటి పనులకు పాల్పడుతున్నట్టు ఆరోపణ లొచ్చాయి.

ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ అయితే పూర్తిగా తెలుగుదేశం సేవలో తరిస్తోంది. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే స్థానాలేవో ఆరా తీయడం దాని పనే. తెలుగుయువతకు అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలో సలహాలిచ్చేదీ ఆ విభాగమే. కానీ ఏజెన్సీలో సంచరిస్తున్న ఎమ్మెల్యేకు నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందని దానికి తెలియదు. విమానాశ్రయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని హతమార్చేందుకు కొందరు కుట్ర పన్నారని దానికి కాస్తయినా ముందస్తు సమాచారం ఉండదు. సీనియర్‌ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి సోదరుడు అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి ప్రాణాలకు హాని కలుగుతుందని ఆ విభాగానికి తెలియనే తెలియదు. ఏమైనా అంటే మాత్రం ఎక్కడలేని రోషమూ వస్తుంది. ‘ఖాకీ దుస్తులు తీసేస్తే మేమూ మాట్లాడగలం’ అంటూ నిష్టూరాలు పోతారు. కానీ అవే దుస్తులతో అధికార పార్టీకి సేవ చేసేందుకు నదురూ బెదురూ లేకుండా సిద్ధపడిపోతారు.

పోలీసు శాఖయినా, మరొక ప్రభుత్వ శాఖయినా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా ఖజానాకు సమకూరే ఆదాయం వల్లనే జీతభత్యాలు పొందుతోంది. ఆ శాఖల అధికారులు ప్రజాసేవకులే తప్ప పాలకుల బంట్లు కాదు. అధికారంలో ఉన్న పార్టీకి ఊడిగం చేయడం వారి విధుల్లో భాగం కాదు. అయినా నిస్సిగ్గుగా, బాహాటంగా ఆ పని చేస్తున్నారు. ప్రస్తుత కీలక సమయంలో ఇలాంటి ఆణిముత్యాలు తనకు దొరకడం కష్టమని కాబోలు... వారిని కాపాడు కునేందుకు ఇప్పుడు బాబు తెగ ప్రయత్నిస్తున్నారు. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే ఆయన ఏకైక లక్ష్యం. ఈ క్రమంలో చట్టాలు, సంప్రదాయాలు, నియమనిబంధనలు ఏమైపోయినా ఆయనకు ఖాతరు లేదు. నిజానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఈ ముగ్గురు అధికారులపై మాత్రమే కాదు... డీజీపీతో సహా ఇతర ఉన్నతాధికారుల తీరుతెన్నులపై ఫిర్యాదు చేసింది. దాన్నుంచి సీఈసీ దృష్టి మళ్లించడం కోసమే జరగరానిదేదో జరిగిందంటూ బాబు తెగ హడావుడి చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ అమ ల్లోకొచ్చాక ప్రభుత్వ యంత్రాంగం సర్వస్వమూ ఎన్నికల సంఘం పరిధిలోకొస్తుంది. దానికి ఎవరూ మినహాయింపు కాదు. జీవోల జారీకి పూనుకున్నవారికి ఈ సంగతి తెలియకపోవడం విడ్డూరం. ప్రస్తుత వ్యవహారంలో సీఈసీ దృఢంగా వ్యవహరించి, బాబుకు, ఆ బాపతు నేతలకు, అధికారులకు కళ్లు తెరిపిస్తుందని ఆశించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top