'నంద్యాలలో కొత్త డ్రామాలు'
కర్నూలు: నంద్యాల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైఎస్సార్ సీపీ మైనార్టీ నేతలు సాధిక్, ఇస్మాయిల్ విమర్శించారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, నంద్యాలలో మాత్రం బీజేపీ జెండాలు లేకుండా ప్రచారం చేయమంటున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే నంద్యాలలో నాటకాలకు తెర తీశారని మండిపడ్డారు. మైనార్టీ నేతలంతా చంద్రబాబు డ్రామాలను గమనిస్తున్నారని హెచ్చరించారు.
మరోవైపు నంద్యాలలో వైఎస్సార్ సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో 100 మైనార్టీ కుటుంబాలు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. కాగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. 26వ వార్డులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శిల్పా మోహన్రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి, కౌన్సిలర్ లక్ష్మీదేవి, కృష్ణమోహన్ తదితరులు ప్రచారం చేశారు.