కేసుల భయంతోనే నోరు మెదపని బాబు

కేసుల భయంతోనే నోరు మెదపని బాబు


∙వైఎస్‌ఆర్‌ కలల సాకారం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

∙ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకా




పులివెందుల/రూరల్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రత్యేక హోదా విషయంలో తన కేసులకు భయపడి కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా సమన్వయకర్త వైఎస్‌ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వైఎస్‌ఆర్‌ ఆడిటోరియంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ  బీజేపీ, టీడీపీ నాయకులు  ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారన్నారు. ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి స్వార్థ ప్రయోజనాల   కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తూ మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ యువభేరీ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.



నవతరానికి మహోత్తరమైన సంజీవని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే దివ్య ఔషధం ఒక ప్రత్యేక హోదా మాత్రమే అన్నారు. అందువల్ల రాబోయే ఎన్నికల్లో 175ఎమ్మెల్యే, 25ఎంపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ కేంద్రం మెడలు ఒంచి ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశం ఉందన్నారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమన్నారు. 2009లో వైఎస్‌ఆర్‌ మరణానంతరం జిల్లాలోని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు. 2009నుంచి 2017 వరకు ప్రాజెక్టులకు కేవలం ముష్టిగా నిధులు కేటాయించడంతో అవి నేటికి పూర్తి దశకు చేరుకోలేదన్నారు. పులివెందుల ప్రాంతంలోని పైడిపాలెం ప్రాజెక్ట్‌కు 6 టీఎంసీలు, సీబీఆర్‌కు 8 టీఎంసీల నీరు వస్తే.. 1.40లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగులోకి వస్తుందన్నారు.



వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ద్వారా బిందు, తుంపర సేద్య పరికరాలు రైతులకు ఉచితంగా అందిస్తే మరో 60వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వవచ్చునన్నారు. దివంగత వైఎస్‌ఆర్‌ మోడల్‌ ప్రాజెక్ట్‌గా రూపొందించడానికి మొదటి విడతలో 25వేల ఎకరాలకు సంబంధించి పనులు పూర్తి చేశారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ పూర్తయితే సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త 2019లో జరిగే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే విధంగా  ఇప్పటినుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు.



యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలను జిల్లా, రాష్ట్రస్థాయిలో చర్చించి వాటి ఆమోదం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.  మూడేళ్ల టీడీపీ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు.   జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక సంస్థలను ప్రస్తుతం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.వ్యవసాయ రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులతోపాటు అరటి, చీనీ పండ్లకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి  ఉన్నతాశయంతో రూ.320కోట్లతో నిర్మించిన ఏపీ కార్ల్‌లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడం.. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.



పులివెందుల మున్సిపాలిటీ, లింగాల, సింహాద్రిపురం, తొండూరు మండలాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం సీబీఆర్‌ నుంచి కొత్త పైపులైన్, గండికోట నుంచి పైపులైన్‌ వేసేందుకు నిధులు మంజూరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు.  2012లో రబీ సీజన్‌కు సంబం ధించి బుడ్డశనగ ప్రీమియం కొంతమంది రైతులకు రాలేదన్నారు. వారికి బీమా పరిహారం కోసం రాష్ట్ర ప్లీనరీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు.



 జగన్‌తోనే పథకాల అమలు సాధ్యం

పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ బూత్‌ కమిటీల ద్వారానే గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం అవుతుందన్నారు. బూత్‌ కమిటీలు పటిష్టంగా ఉంటే ఏ ఎన్నికల్లోనైనా సులభంగా విజయం సాధించవచ్చునన్నారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాల అమలు వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఆయన హయాంలో మహిళా విద్యను ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు చేశారన్నారు.   రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే కరువు వచ్చినట్టు లెక్క అన్నారు. గత మూడేళ్ల కాలంలో తీవ్ర వర్షాభావంతో రైతులు  ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఎన్నో కష్టాలు పడుతుంటే టీడీపీ మహానాడు పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. 1982లో ఎన్‌టీఆర్‌ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కబ్జా చేసి నందమూరి వంశాన్ని దూరంగా పెట్టారన్నారు. గతంలో సీఎం గా పనిచేసిన చంద్రబాబు 9ఏళ్ల పాలనలో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు నిధులు మం జూరు చేయకుండా నిర్వీర్యం చేశారన్నా రు.  



వైఎస్‌ జగన్‌ను విమర్శించేస్థాయి లోకేష్‌కు లేదు

పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రలోభాలకు లొంగని నాయకులను హత్యలు చేయడానికి సైతం వెనుకాడటంలేదన్నారు. కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు హత్య చేశారన్నారు. వైఎస్‌ కుటుంబం ఫ్యాక్షన్‌ను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు కృషి చేస్తుంటే.. మంత్రులు పరిటాల సునీత, అచ్చెన్నాయుడులు వైఎస్‌ కుటుంబాన్ని విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్‌ జగన్‌ను విమర్చించే స్థాయి మంత్రి లోకేశ్‌కు  లేదన్నారు. దొడ్డిదారిన పదవి పొందిన వ్యక్తి వైఎస్‌ జగన్‌పై సవాల్‌ చేయడం సిగ్గుచేటు అన్నారు.  అంతకముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top