‘చంద్రబాబు, లోకేశ్ దండుకుంటున్నారు’
విజయవాడ : అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి మండిపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ కాంట్రాక్ట్ల పేరుతో చంద్రబాబు, లోకేశ్ దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన ఘనత చంద్రబాబుదేనని, మూడేళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించారో, ఎంతమందికి రేషన్ కార్డులిచ్చారో వెల్లడించాలని గౌతంరెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులైనవారికి పక్కా ఇళ్లు కట్టించారని, ఇప్పుడు చంద్రబాబు గృహ నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రబుత్వాన్ని ప్రైవేట్ ఈవెంట్లకే పరిమితం చేసి ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేశారని అన్నారు. జన్మభూమి సభలో పెన్షన్ల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా...మంజూరు మాత్రం నామమాత్రంగానే ఉందన్నారు.