రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సంబేపల్లె: మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం మోటకట్ల కస్పాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు చిన్నమండెం మండలం మల్లూరు పంచాయతీ నేరెళ్లంకకు చెందిన బెల్లం నరసింహారెడ్డి కుమారుడు బెల్లం సాయిరాంరెడ్డి (23) ద్విచక్రవాహనంలో సొంత పనుల నిమిత్తం రాయచోటి వెళ్లి తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు. మోటకట్ల బస్స్టాప్ వద్దకు రాగానే రాయచోటి నుంచి పీలేరు వైపు వెళుతున్న లారీ ఢీ కొనడంతో సాయిరాం రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సీఏ విద్యను పూర్తి చేసినట్లు సమాచారం. మృతుడి తండ్రి నరసింహారెడ్డి చిన్నమండెం మండలం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎస్ఐ సయ్యద్ హాషం ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.