భార్య చేతిలో భర్త హతం
– ఇంట్లో హత్య చేసి పాడుబడ్డ బావిలో మృతదేహాన్ని తగులబెట్టిన వైనం
– హతుని కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు
– ఉప్పలపాడులో చోటు చేసుకున్న ఘటన
ఓర్వకల్లు : మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తూ, అరాచకాలకు పాల్పడుతున్న భర్తను భార్య హతమార్చిన ఘటన మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఉస్బీకి, కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన మౌలాలి(46)కి ఇరవై ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి అలిబాషా, చాంద్ బీబీ సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. వచ్చిన సంపాదనతోనే పిల్లలిద్దరికీ రెండేళ్ల క్రితం పెళ్లిళ్లు చేశారు.
మద్యానికి బానిసైన మౌలాలి తరచుగా భార్యతో గొడవ పడి వేధింపులకు గురిచేసేవాడు. అతని అరాచకాలకు తట్టుకోలేక హుసేన్బీ పదేళ్ల క్రితమే పుట్టింటికి చేరుకుంది. అయినా మౌలాలి ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే గొడవ పడ్డారు. భర్త ప్రవర్తనపై విరక్తి చెందిన భార్య గొడ్డలితో తలపై బాదింది. దీంతో మౌలాలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం బయటకు పొక్కకుండా కుమారుడు అలిబాషా, మామ హుసేన్ సాహెబ్ మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి గ్రామ శివారులోని కరికెల దేవాలయం వద్ద గల పాడుబడ్డ బావిలో పడేసి కిరోసిన్తో తగులబెట్టారు. హుసేన్బీ తమకేమీ తెలియనట్టు గ్రామస్తులతో పాటు మిరప పండు తెంపేందుకు గడివేముల మండలం గని గ్రామానికి కూలీపనికి వెళ్లింది.
ఉదయం అటువైపు వెళ్తున్న కావలికాండ్లు బావిగడ్డపై రక్తపు మరకలు ఆధారంగా విషయాన్ని బయట పెట్టారు. మొదట గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు సమాచారం అందజేశారు. ఆ మేరకు కర్నూలు తాలూకా సీఐ నాగరాజు యాదవ్, ఎస్సైలు చంద్రబాబునాయుడు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో విచారించగా అసలు విషయం బయటపడింది. హతుని కుమారున్ని అదుపులోకి తీసుకొని వేలిముద్ర నిపుణులను, డాగ్స్క్వాడ్ బృందాలను పిలిపించారు. ఆలోగ అలీబాషా వాస్తవ పరిస్థితిని ఒప్పుకోవడంతో వీఆర్ఓ గోపీ కిషన్తో పంచనామా రిపోర్టు తీసుకున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ఫోరెన్సిక్ పరీక్షలకు తీసుకెళ్లినట్లు సీఐ నాగరాజు యాదవ్ తెలిపారు. హత్యకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు పేర్కొన్నారు.