డెయిరీ మేనేజర్ సస్పెన్షన్
రాయచోటిటౌన్: రాయచోటి విజయా పాల డెయిరీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. అందుకు మేనేజర్ను సస్పెండ్ చేశామంటూ జిల్లా విజయా డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ ( డీడీ) శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 25వ తేదీన డెయిరీలో దొంగలు పడ్డారు శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో గత రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. బుధ, గురువారం రాయచోటికి వచ్చిన ఆయన స్థానికంగా ఉన్న పాడి రైతులతో వేర్వేరుగా మాట్లాడారు. ఇందులో ఉన్న లోపాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. తనిఖీ కోసం వచ్చారన్న విషయం సాక్షికి తెలియడంతో అక్కడికి వెళ్లగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. డెయిరీలో దాదాపు రూ.8 లక్షలకు పైగా మోసం జరిగినట్లు ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. మేనేజర్ నుంచి సుమారు రూ.4లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. మేనేజర్ ఆధ్వర్యంలో తప్పులు దొర్లాయి కాబట్టి ఆయనను సస్పెండ్ చేశామని డీడీ చెప్పారు.