నేడు వైఎస్సార్సీపీ జిల్లాస్థాయి ప్లీనరీ
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశం ఈనెల 21న స్థానిక గుత్తిరోడ్డు కేటీఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్రెడ్డి తదితరులు పరిశీలించారు. ప్లీనరీకి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా ఇన్చార్జ్, ఎంపీ మిథున్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హాజరవుతారని వెల్లడించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సీజీసీ, సీఈసీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల కమిటీ కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ సంఘాల నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సింగిల్విండో అధ్యక్షులు తరలిరావాలని వారు విజ్ఞప్తి చేశారు.
ప్లీనరీ షెడ్యూల్ ఇలా
ఉదయం 10 గంటలకు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతినిధుల పేర్లు నమోదు కార్యక్రమం ఉంటుంది. 10.30 గంటలకు దివంగత వైఎస్సార్ చిత్ప పటానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, చేనేత కార్మికులకు సంతాపంగా మౌనం పాటిస్తారు. తర్వాత జిల్లాలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు సంతాపం తెలియజేస్తారు. అనంతరం వివిధ అంశాలను ప్లీనరీలో ప్రవేశపెట్టి చర్చిస్తారు.