విజయవాడలో అదృశ్యం హైదరాబాద్లో ప్రత్యక్షం
సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లి అదృశ్యమైన ముగ్గురు 9వ తరగతి విద్యార్థినులు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్లో జరిగే వినాయక నిమజ్జనాన్ని చూడటానికి విద్యార్థినులు అక్కడికి వెళ్లినట్లు గుర్తించిన ప్రత్యేక పోలీస్ బృందం వారిని సురక్షితంగా తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఉప్పుతల శరణువల్లి(15), ఆది వైష్ణవి(14), అత్తులూరి నాగ సంజన(14)లు మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన వీరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరిపి విద్యార్థినులు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి వారిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.