గుంటూరులో 20 పుష్కర నగర్లు


ధరణికోట, పెనుమూడిని మోడల్‌ ఘాట్‌లుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: జిల్లాలో పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మంగళవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. త్వరలో సీఎం ఘాట్‌లను పరిశీలించనున్న నేపథ్యంలో ధరణికోట, పెనుమూడి ఘాట్‌లను మోడల్‌ ఘాట్‌లుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పుష్కరాల్లో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. రోజుకు లక్ష మందికి ఉచితంగా భోజనాలు అందించేందుకు ఎంఎస్‌ ట్రస్టు, వాసవి నిత్య అన్నదాన సత్రంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఘాట్‌ ఇన్‌చార్జిల నియామకాలు కొలిక్కి వచ్చాయని తెలిపారు. ఘాట్‌లో రెవెన్యూ , ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్‌ శాఖల సిబ్బంది మూడు షిప్టుల్లో పని చేస్తారన్నారు. పుష్కర నగర్‌లను కలుపుతూ ఆర్టీసీ వారు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించిందన్నారు.

 

పుష్కర నగర్ల ఏర్పాటు...

జిల్లాలో సీతానగరంలో 8 పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మంది భక్తులకు వీలుగా ఉంటుంది. ఏజేసీ ముంగా వెంకటేశ్వరరావుకు ఘాట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రాయల్‌ ఫాం వద్ద 3 వేలు, మోడల్‌ డైరీ 2500, సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపం 1500, కృష్ణా కెనాల్‌ రైల్వే స్టేషన్‌ 5 వేలు, ప్యారీ కంపెనీ సమీపంలో 3 వేలు, రిథమ్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ వద్ద 2 వేలు, నూలకపేట 2500, ఎయిమ్స్‌ సమీపంలో 10 వేల మందికి సరిపడా పుష్కర్‌నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు గోరంట్లలో 10 వేలు, తాళ్లాయపాలెం (శైవ క్షేత్రం) 10 వేలు, అమరావతిలోని నాలుగు ప్రదేశాల్లో 25 వేలు, పెనుమూడి 10 వేలు, గురజాల డివిజన్‌లో పొందుగుల, దైద, సత్రశాల, కష్ణవేణి ఘాట్లలో 15 వేల మంది ఉండేందుకు పుష్కర నగర్లు నిర్మిస్తున్నారు. సమావేశంలో ఏజేసీ ముంగా వెంకటేశ్వరరావు, నగర కమిషనర్‌ నాగలక్ష్మి, డీఆర్వో నాగబాబు, ఆర్‌డీవోలు మురళి, శ్రీనివాసులు, రవీంద్ర, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీహరి, విద్యుత్‌ ఎస్‌ఈ జయభరత్‌రావు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top