'సీఎం జిల్లాలో పోలీసుల బరితెగింపు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో పోలీసులు బరితెగిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గాలి ముద్దుకృష్ణమకు జీ హుజూర్ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
'నగరి మున్సిపల్ చైర్మన్ శాంతకుమారి ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేశారు. దీంతో నగరిలో పరిస్థితి భయానకంగా మారింది. అక్రమాలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయాలని మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. టీడీపీ నేతల కుట్రలను వైఎస్సార్సీపీ ధైర్యంగా ఎదుర్కొంటుంది' అని ఎమ్మెల్యే రోజా అన్నారు.