బాబు మోసం చేశారు
ఉలవపాడు: చంద్రబాబు నాయుడు నిరుద్యోగభృతి ఇవ్వకుండా ఎంతో మోసం చేశారని వెంకటాద్రిపాలెంకు చెందిన గురజాల రాణి, రెబ్కా తెలిపారు. తమ తండ్రి, తల్లి, అన్నను కోల్పోయామని.. డిగ్రీలు చదివినా కూలి పనులకు వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి వస్తుందనుకుంటే రాలేదని చెప్పారు. తమలాంటివారిని ఆదుకోవాలని కోరారు.
చీరాల అర్బన్: ‘సంవత్సరం క్రితం ఉపాధి హామీ కూలీగా పనిచేసే సమయంలో కాలికి గాజు పెంకు గుచ్చుకుని గాయం అయింది. ఇన్ఫెక్షన్ కారణంగా కాలును మోకాలు వరకు తీసివేశారు. వైకల్యం 85 శాతం ఉన్నట్లుగా సదరం సర్టిఫికెట్ ఉన్నా వికలాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. అయినా మంజూరు కావడంలేదు. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమ కుటుంబానికి పింఛన్ డబ్బులు కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ ఎడ్లూరుపాడుకు చెందిన జి.యల్లమంద వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన సమస్యను విన్నవించుకున్నాడు.
టీడీపీ ప్రభుత్వం రాగానే తొలగించారు
చీరాల అర్బన్: వైఎస్సార్సీపీకి ఓటేశానని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నరసింగోలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే తనను తొలగించారని గ్రామానికి చెందిన పి.రత్తమ్మ.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించింది. గ్రామంలో ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నట్లు వాపోయింది.