ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలయ్యా!
నెల్లూరు(సెంట్రల్): ప్రైవేట్ స్కూళ్లు మూసివేసే పరిస్థితి ఉందని, వాటిని ఏ విధంగా అయినా ఆదుకునే విధంగా చూడాలని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. స్కూళ్లలో పెట్టుకోవాల్సిన ఫైర్ సర్టిఫికెట్ కోసం ఒక్కో పాఠ«శాలకు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అడుగుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాదీ అది రెన్యువల్ చేసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదని వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. ఫైర్ సర్టిఫికెట్ రెన్యువల్ గడువును పదేళ్లకోసారి రెన్యువల్ చేసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు చిన్నచిన్న ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. స్పందించిన జగన్మోహన్రెడ్డి తప్పకుండా మన ప్రభుత్వం వస్తే సమస్యలను పరిష్కరిస్తామని వారికి ధైర్యం చెప్పారు.