డాక్టర్ టీవీ రావుకు నోబుల్ అవార్డు
గుంటూరు రూరల్: దాక్షిణ్య వికలాంగుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ టీవీరావుకు దేవరాజ్ సేవా ప్రతిష్టాన సంస్థ నోబుల్ అవార్డును ప్రదానం చేసింది. మంగళవారం నగర శివారుల్లోని దాక్షిణ్య సంస్థలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో డాక్టర్ టీవీ రావు మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ ఆర్వీ దేవరాజ్ సేవా ప్రతిష్టాన ప్రథమ వార్సికోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి నోబుల్ అవార్డులను అందించారని తెలిపారు. కర్ణాటక చిక్పేట నియోజకవర్గ శాసన సభ్యులు ఆర్వీ దేవరాజ్, నగర మేయర్ జి. పద్మావతి అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారన్నారు. అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా దాక్షి ణ్య సంస్థకున్న పేరుకు తగ్గట్టుగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మానసిక వికలాంగులు దేవునితో సమానమని, వారితో గడపటం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. దాక్షిణ్య సంస్థ సభ్యులు, సిబ్బంది ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.