15 ఏళ్లుగా బ్యాంకులకు 'పూజారి' బురిడీ

15 ఏళ్లుగా బ్యాంకులకు 'పూజారి' బురిడీ


హిందూపురం: ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.. మండల పరిషత్ అధ్యక్షుడు. పట్టాదారు పాసుపుస్తకంలో తనకున్న భూమికన్నా ఎక్కువ నమోదు చేయించి గత 15 ఏళ్లుగా బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నాడు. అనంతపురం జిల్లా పరిగి మండల పరిషత్ అధ్యక్షుడు పూజారి సత్యనారాయణకు కోడిగెనహళ్ళి గ్రామంలో సర్వే నెంబరు. 55/1లో 0.60ఎకర భూమి ఉంది. అయితే పలుకుబడి ఉపయోగించుకుని 7.90ఎకరాలు ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకం చేయించుకున్నాడు.



దానిపై కొడిగెనహళ్ళి సిండికేట్ బ్యాంకులో రూ. 83వేలు పంట రుణం తీసుకున్నాడు. మొదటి విడతలో రూ. 17వేలు రుణ మాఫీకూడా అయ్యింది. ఇంతలోనే ఈ పాసు పుస్తకం తతంగం బయటకు పొక్కడంతో మిగతా మొత్తం బ్యాంకు అధికారులకు చెల్లించి పట్టాదారు పాసుపుస్తకాన్ని తీసుకున్నాడు.



అయితే 1995లో సత్యనారాయణ పేరుమీద కేటాయించిన పాసుపుస్తకం నకిలీదా లేక పలుకుబడి ఉపయోగించుకుని అధికారులతోనే చట్టబద్దంగా పక్కరైతు పొలాలను పాసుపుస్తకంలోకి ఎక్కించుకున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నకిలీ పాసుపుస్తకాలకు సంబంధించి ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తుండడంతో దీన్ని నుంచి బయట పడేందుకు ఎంపీపీ రెవెన్యూ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.



7.90 ఎకరాల పాసుపుస్తకంతో రూ. 83వేలు తీసుకున్నాడు...

గతంలో 7.90ఎకరాల పాసుపుస్తకం పెట్టి రూ. 83వేలు పూజారి సత్యనారాయణ రుణం తీసుకున్నాడని, అయితే బ్యాంకు వద్ద కొంత మంది రైతులు మా సర్వే నెంబర్లను కూడా ఆయన పాసుపుస్తకంలో ఎక్కించుకున్నారని గొడవ చేశారని, ఈ విషయం ఆయనకు తెలియజేయడంతో రుణం మొత్తం చెల్లించాడని తెలిపారు.

- సిండికేట్ బ్యాంకు మేనేజర్ హరీష్



చర్యలు తీసుకుంటాం...

సత్యనారాయణ ఎక్కువ పొలం చూపించి కొడిగెనహళ్ళి సిండికేట్ బ్యాంకులో రుణం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించగా బ్యాంకు అధికారులను కలిసి విచారించి చర్యలు తీసుకుంటాం.

- తహశీల్దార్ గోపాలకృష్ణ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top