నాకేపాపం తెలీదు
► అంతా నా ముందు పని చేసిన వారే చేశారు
► సిట్ ఎదుట మాజీ తహసీల్దార్ శంకరరావు
► భూ కుంభం కోణంలో పెద్దల పేర్లు బయటపెట్టని వైనం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ భూ కుంభకోణంలో పెద్దల హస్తం ఉందంటూ ఓ పక్క రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఒకరిపై ఒకరి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సాక్షాత్తూ మంత్రి అయ్యన్న పాత్రుడు సిట్ బృందం ఎదుట హాజరై భూ కుంభకోణాలపై తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించారు.
ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు, దందాలపై పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి. కేవలం 15 రోజుల్లో సిట్కు 2,600కి పైగా ఫిర్యాదులందా యి. వాటిలో 1బీ రికార్డుల ట్యాంపరింగ్, ప్రభు త్వ భూముల కబ్జాకు సంబంధించి సుమారు 15 వందలకు పైగా ఫిర్యాదులు అందినట్లు అధి కారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు గడిచిన మూడేళ్లలోనే రికార్డుల ట్యాంపరింగ్, భూకబ్జాలు జరిగాయని కుండబద్దలుగొట్టారు. అయితే మాజీ తహసీల్దార్ శంకరరావును విచారించిన సిట్ అధికారులు ఆశించిన స్థాయిలో వివరాలు రాబట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాకే పాపం తెలియదు
కాగా.. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావించి మాజీ తహసీల్దార్ శంకరరావును జుడీషియల్ కస్టడీ నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న సిట్.. అతని నుంచి ఆశించిన స్థాయిలో వివరాలు రాబట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రోజుల పాటు రహస్య
ప్రదేశానికి కెళ్లి..విచారించినప్పటికీ.. ఆయన మాత్రం నోరు మెదపలేదని తెలుస్తోంది. ముఖ్యంగా భీమిలి, విశాఖ రూరల్ పరిధిలో రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ భూమలు కబ్జాలకు సంబంధించి ఎలా జరిగింది.. వెనుక ఎవరున్నారు, ఎవరు చేయించారు తదితర వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు శ్రమటోడ్చాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే.. శంకరరావు మాత్రం.. తనకేపాపం తెలీదని, కావాలనే ఈ వ్యవహారంలో తనను బలిపశువును చేశారని, ట్యాంపరింగ్ వ్యవహారమంతా తన కంటే ముందు పనిచేసిన అధికారుల హయాంలోనే జరిగిందని సిట్ ఎదుట వాపోయినట్లు సమాచారం. 5 రోజుల పాటు జరిగిన విచారణలో అధికార పార్టీ నేతల పేర్లను మాట మాత్రంగానైనా శంకరరావు చెప్పలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సుధాకర్ నుంచి కీలక సమాచారం
ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టు చేసిన ఓ కీలక నిందితుడైన సుధాకర్రాజు అలియాస్ దాలి వమ్మినాయుడి నుంచి సిట్ కొంత వరకూ వివరాలు రాబట్టుకుందని చెబుతున్నారు. ఇప్పటికే ట్యాంపరింగ్లో హస్తం ఉన్నట్టు గుర్తించిన 56 మందిలో ఏ ఒక్కరూ చెప్పుకోతగ్గ నేతలు, ప్రజాప్రతినిధులు లేరని సిట్ వర్గాలు చెబుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న సిట్ విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయ్యన్న ప్రకటనతో కలవరం
మరిన్ని ఆధారాలతో ఈ నెల 19న సిట్కు మరో ఫిర్యాదుల చిట్టా అందజేస్తానని మంత్రి అయ్యన్న చేసిన ప్రకటన గంటా వర్గీయులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆరంభం నుంచి ఈ కుంభకోణం వ్యవహారంలో దూకుడుగా విమర్శలు చేసిన బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్రాజు కూడా ఈ నెల 20వ తేదీన తనదగ్గరున్న ఆధారాలతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్పడిన భూ కబ్జాలు, దందాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన సాక్షికి తెలిపారు.