కేఎల్ఐ ద్వారా చెరువులన్నీ నింపుతాం
గోపాల్పేట : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) ద్వారా అన్ని చెరువులు, కుంటలను నింపుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పొల్కెపహడ్ తిమ్మయ్యకుంట, మొగుళ్ల చెరువును, కేఎల్ఐ ప్రధాన కాల్వ ద్వారా డిస్టిబ్యూటరీ–8 నుంచి పారుతున్న నీటితో అలుగు పోస్తున్న తిమ్మయ్యకుంటను ఆయన పరిశీలించారు. అలుగు వద్ద కొబ్బరికాయ కొట్టి పూలు వదిలారు.
కుంట నిండుకుని మొగుళ్ల చెరువుకు నీళ్లు చేరుతుండడంతో హర్షం వ్యక్తం చేశారు. దసరా పండుగ నాటికి ఈ చెరువు నిండుతుందని, ఈ ప్రాంతంలో ఇదే చెరువు పెద్దదని, ఒక వైపు గుట్టలు ఉండడం వల్ల నీటి నిల్వ అధికంగా ఉంటుందని స్థానిక నాయకులు నిరంజన్రెడ్డికి వివరించడంతో రానున్న రోజుల్లో దీన్ని రిజర్వాయర్ను చేసి సుమారు 25 గ్రామాలకు సాగునీటి అందించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా చెరువులు, కుంటలకు వెళ్లే ఫీడర్ చానల్లను ఉపాధిహామీ పథకంలో మరమత్తు చేయాలని అక్కడే ఉన్న ఈజీఎస్ అధికారికి సూచించారు. నిరంజన్రెడ్డి వెంట ఎత్తం రవికుమార్, సత్యశీలారెడ్డి, కోటీశ్వర్రెడ్డి, అమరేందర్గౌడు, కొత్త రామారావు, గాజుల కోదండం, చంద్రశేఖర్, బాలరాజు, ఠాగూర్, మునీంద్ర, వాకిటి శ్రీధర్, రైతులు ఉన్నారు.