డిసెంబర్ 20న రైతు బహిరంగ సభ
విజయవాడ(గాంధీనగర్) : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో సి.రామచంద్రయ్య అధ్యక్షతన రైతు సంఘం ఆఫీస్ బేరర్లు, జాతీయ సమితి సభ్యుల సంయుక్త సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు రైతుల సమీకరణకు 10వ తేదీ నుంచి రైతు జాతా ప్రారంభించనున్నట్లు వివరించారు. శ్రీకాకుళం నుంచి, కర్నూలు నుంచి రైతు రక్షణ జాతా 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో బయలుదేరే జాతా విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల్లో పర్యటిస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో బయలుదేరే జాతా కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం , గుంటూరు జిల్లాల్లో పర్యటించి విజయవాడకు చేరుకుంటుందని పేర్కొన్నారు. జాతాలు పర్యటించే ప్రాంతాల్లో రైతు సంఘం కార్యకర్తలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొన్నారు.