పరీక్షా కాలం


ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్‌ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తొలిసారిగా ప్రాక్టికల్‌ పరీక్షలు సైతం జంబ్లింగ్‌ విధానంలో జరగనున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిశాక.. పక్షం రోజుల్లోనే ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోని సైన్స్‌ ల్యాబ్‌లను సందర్శించి.. అక్కడి పరిస్థితులను ముందుగానే పరిశీలించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈనెల 28న ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వేల్యూస్, 31న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 

 

21,925 మంది విద్యార్థులు

ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిబ్రవరి 3నుంచి 22వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 29, ఎయిడెడ్‌ కళా శాలల్లో 11, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 21 కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. బైపీసీ విద్యార్థులు 4,662 మంది, ఎంపీసీ విద్యార్థులు 17,263 మంది కలిపి 21,925 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. 

 

పబ్లిక్‌ పరీక్షలకు 104 కేంద్రాలు

ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలను మార్చి 1నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 104 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీలు 29, ఎయిడెడ్‌ కళాశాలలు 14, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలు 3, ప్రైవేట్‌ విద్యాసంస్థలు 58 ఉన్నాయి. ఫస్టియర్‌ విద్యార్థుల్లో జనరల్‌ 33,499 మంది, ఒకేషనల్‌ 4,011 మంది ఉన్నారు. సెకండ్‌ ఇంటర్‌లో జనరల్‌ విద్యార్థులు 32,211 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 3,516 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లాలో 194 జూనియర్‌ కాలేజీలు, 60 ఒకేషనల్‌ కళాశాలలు ఉన్నాయి. 

 

పరీక్షలకు అంతా సిద్ధం

ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాలు ఉన్న కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ల్యాబ్‌లు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులు సైన్సు ల్యాబ్‌లను ముందుగానే పరిశీ లించుకునే అవకాశం కల్పించాం. ఈనెల 19న కలెక్టరేట్‌లో ఇంటర్‌ విద్యామండలి కమిషనర్‌తో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని 61 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్‌ విధిగా హాజరుకావాలి.  – ఎస్‌ఏ ఖాదర్, ఆర్‌ఐవో 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top