7న కేబుల్ టీవీ ప్రసారాల నిలిపివేత
హైదరాబాద్: డిజిటలైజేషన్ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 7 ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు టీవీ ప్రసారాలను నిలిపివేయనున్నట్లు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.జితేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సతీశ్ముదిరాజ్ తదితరులు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని కేబుల్ వినియోగదారులు ఇందుకు సహకరించాలని వారు కోరారు.
దోమలగూడలోని కార్యాలయంలో సంఘం నాయకులు బద్రీనాథ్యాదవ్, రాజీవ్ శ్రీవాస్తవ, రమణకుమార్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. డిజిటలైజేషన్ జరిగితే పే చానల్ రేట్లు, ట్యాక్స్లు కలుపుకుని దాదాపు రూ.500 నుంచి రూ. 600 వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిజిటలైజేషన్ను వ్యతిరేకించడం లేదని, అయితే ఎంఎస్వోలు చానల్స్ ధరలు పెంచనుండడంతో ఆపరేటర్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తుందని తెలిపారు.