పుష్కరాల్లో అపశ్రుతి
మృతుడు హైదరాబాద్ నగర వాసి
పెద్దకొత్తపల్లి : కృష్ణాపుష్కరాల్లో అపశ్రుతి దొర్లింది. పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన ఓ డ్రైవర్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని చంచల్గూడకు చెందిన సత్యనారాయణ, కృష్ణ తమ కుటుంబ సభ్యులు 24మందితో కలిసి పుష్కరస్నానం ఆచరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా సోమవారం ఉదయం స్వరాజ్ మినీ వ్యాన్లో వారు కొల్లాపూర్ మండలం అమరగిరి ఘాట్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే నదిలోకి వెళ్లిన వాహన డ్రైవర్ మహేష్గౌడ్ (32) నీట మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన భక్తులు వెంటనే గజఈతగాళ్లకు తెలపడంతో మృతదేహాన్ని వెలికితీసి కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ మనోజ్కుమార్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా, మహేష్గౌడ్కు భార్య బాలమణితోపాటు కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరు మున్నీరయ్యారు.