నవంబర్ 2 నుంచి ఎయిరిండియా వైజాగ్ సర్వీస్
గన్నవరం(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నానికి ఎయిరిండియా సంస్థ నవంబర్ 2వ తేదీ నుంచి సర్వీసును ప్రారంభించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇక్కడికి నడుపుతున్న సర్వీస్ను విశాఖపట్నం వరకు పొడగిస్తూ ఈ మేరకు షెడ్యూల్ను విడుదల చేశారు. శుక్ర, శనివారాలు మినహా వారంలో ఐదు రోజుల పాటు 72 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఏటీఆర్ విమానాన్ని ఈ సర్వీస్ నిమిత్తం నడపనున్నారు.
ఈ విమానం హైదరాబాద్ నుంచి ఉదయం 6.35 గంటలకు బయలుదేరి 7.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. అనంతరం 8 గంటలకు బయలుదేరి 9.10కు వైజాగ్ చేరుకుంటుందని ఎయిరిండియా ప్రతనిధులు తెలిపారు. తిరిగి 9.40 గంటలకు వైజాగ్లో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు 10.50కు చేరుకుంటుందని, అరగంట విరామం తర్వాత ఇక్కడి నుంచి 11.20కు బయలుదేరి 12.20కు హైదరాబాద్కు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా గన్నవరం నుంచి మరిన్ని రీజినల్ సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా సన్నహాలు చేస్తోంది.