‘మోదీకి బంటుగా ఉంటాడు’
సాక్షి, నిజామాబాద్ : పదేళ్ల కాంగ్రెస్ హయాంలో 25లక్షల ఇళ్లు కట్టిస్తే.. ఐదేళ్లలో బీజేపీ కోటి ముప్పై లక్షల ఇళ్లు కట్టించిందని, దేశ అభివృద్దిని చూసి నరేంద్రమోదీకి ఓటు వేసి మరోసారి బీజేపీకి పట్టంకట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలను కోరారు. నిజామాబాద్లో మంగళవారం ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ను పార్లమెంట్కు పంపిస్తే.. మోదీకి బంటుగా ఉంటాడనని అన్నారు. రైతుల కోరిక మేరకు పసుపు బోర్డ్ ఏర్పాటుచేస్తామన్నారు. ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామని హామి ఇచ్చారు.
టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో తెలంగాణలో వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుందో లేదో కానీ.. అవినీతి అక్రమాలు మాత్రం నడుస్తున్నాయని విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని వందరోజుల్లో స్వాధీనం చేసుకుంటామని పూర్తిగా మూసేశారని ఎద్దేవా చేశారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, మోదీ హయాంలో భారత్ శక్తిమంతంగా తయారయిందని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను తిప్పికొడుతున్నామని తెలియజేశారు.